రువనంతపురం: లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ (పరిపాలనాధికారి) ప్రఫుల్ కే పటేల్ను వెనుకకు రప్పించాలని కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి పినరాయి విజయన్ సమర్పించిన ఈ తీర్మానానికి మద్దతుగా పాలక, విపక్ష సభ్యులు ఓటు వేశారు. కొన్ని సవరణలతో తీర్మానం సభ ఆమోదం పొందింది. లక్షద్వీప్ కొత్త అడ్మినిస్ట్రేటర్ గా వచ్చి గుజరాత్ మాజీ హోంమంత్రి, బీజేపీ నాయకుడు కాషాయ ఎజెండా అమలు చేస్తున్నారని, కార్పోరేట్లకు కొమ్ము కాస్తున్నారని సీఎం విజయన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. స్థానిక ప్రజల జీవనవిధానానికి భంగకరమైన అనేక నిబంధనలు తెస్తున్నారని వివరించారు. మొట్టమొదటిసారిగా మద్య విక్రయాన్ని అనుమతించిన పటేల్ అత్యధికులు ముస్లింలే ఉండే లక్షద్వీప్లో బీఫ్ను నిషేధిస్తున్నారని తెలిపారు. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయరాదని మరో నిబంధన తెచ్చారని, స్థానిక సంస్కృతి, భాష, జీవనవిధానం, ఆహారనియమాలు అన్నిటిని మార్చాలని చూస్తున్నారని సీఎం విజయన్ తెలిపారు. సంఘ్ పరివార్ విధానాలకు లక్షద్వీప్ను ప్రయోగకశాలగా మలుస్తున్నారని హెచ్చరించారు.
లక్షద్వీప్లో ఏం జరుగుతున్నది?
కొత్త పరిపాలనాధికారిపై అక్కడి ప్రజలు ఎందుకు మండిపడుతున్నారు?
కేరళ తీరానికి 277 నుంచి 370 కిలోమీటర్ల దూరంలో పరుచుకుని ఉన్న సుమారు 30 దీవుల సమూహమే లక్షద్వీప్. భారతదేశంలోని అతిచిన్న కేంద్రపాలిత ప్రాంతం ఇది. దీనికి పరిపాలనాధికారిగా కేంద్రం నియమించిన ‘అడ్మినిస్ట్రేటర్’ ఉంటారు. ఇప్పటిదాకా మాజీ ఐఏఎస్ అధికారులను ఆ పదవిలో నియమించేవారు. ఇటీవల అడ్మినిస్ట్రేటర్ దినేశ్వర్ శర్మ మరణించడంతో ప్రఫుల్ కోడా పటేల్ను కేంద్రం ఆ పదవిలో నియమించింది. ఈయన గుజరాత్ రాజకీయనేత. ప్రధాని నరేంద్ర మోదీకి, హోంమంత్రి అమిత్ షాకు సన్నిహితుడు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్గా నియమితుడైన మొట్టమొదటి రాజకీయవేత్త అయిన పటేల్ అన్నిట్లో తన ముద్ర చూపిస్తున్నారు. బీజేపీ ఎజెండా అమలు చేస్తున్నారు. 60 వేల పైచిలుకు జనాభాలో ముస్లింలు అధికం. వారు ఇష్టంగా తినే బీఫ్ మానేయాలని నిబంధనలు తెస్తున్నారు. ఇప్పటివరకు ఈ దీవుల్లో మద్యం అమ్మకాలకు అనుమతి లేదు. కానీ పటేల్ మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఇవి స్థానికులకు మింగుడు పడడం లేదు. ఇంతేనా అంటే ఇంకా చాలా ఉంది. ఇప్పటివరకు లక్షద్వీప్ లో బయటివారికి భూములు కొనే హక్కు లేదు. ప్రైవేటు వ్యాపారాలు లేవు. ప్రశాంత జీవనానికి అలవాటు పడ్డారు ప్రజలు. జైళ్లు ఖాళీగా ఉండడం ఇక్కడి శాంతిభద్రతలకు అద్దం పడుతుంది. కానీ ఇప్పుడు అభివృద్ధి పేరిట పటేల్ చాలా మార్పులే ప్రతిపాదించారు. వాటిపై ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. ఎవరూ కిక్కురుమనకుండా ఉండేందుకు పటేల్ కొత్తగా గూండా యాక్టు తరహా భద్రతా నిబంధనలు తెచ్చారు. అవి అమలు చేస్తే నిరసనలు తెలిపేవారందరూ జైళ్లకు పోతారు. వాహనాలు అంతంత మాత్రంగా ఉండే దీవుల్లో రోడ్ల విస్తరణ అంటున్నారు. రోడ్ల పక్కన ఉండే ఇళ్లను కూల్చేస్తున్నారు. పరిహారం ఇవ్వడం లేదు. సున్నితమైన పర్యావరణం కలిగిన లక్షద్వీప్లో గనుల తవ్వకం అనుమతించాలని చూస్తున్నారు. దీవుల తీరంలో జాలరులు తమ వస్తువుల పెట్టుకునేందుకు కట్టుకున్న షెడ్లను భద్రతకు ముప్పు అంటూ తొలగిస్తున్నారు. లక్షద్వీప్కు మామూలుగా ఎవరైనా వెళ్లాలన్నా స్థానిక పరిపాలనా విభాగం ముందస్తు అనుమతి తప్పనిసరి. అలాంటిది ఇప్పుడు ఆ ప్రత్యేక హక్కులను పక్కన పెట్టి ప్రైవేటుకు ద్వారాలు తెరవాలని అడ్మినిస్ట్రేటర్ పటేల్ చూస్తున్నారు. ద్వీపవాసులు సరుకులు, వైద్యంతో పాటుగా ప్రతిదానికీ కేరళలోని కోచ్చిపై ఆధారపడతారు. ఇప్పుడు పటేల్ కర్నాటకలోని మంగళూరుకు వెళ్లాలని హుకుం జారీచేశారు. పటేల్ వరుసపెట్టి తెస్తున్న, తేవాలనుకుంటున్న మార్పులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విపక్ష కాంగ్రెస్ పార్టీ లక్షద్వీప్లో పటేల్ పాలనాశైలిపై మండిపడుతున్నది. లక్షద్వీప్ శాంతిని, సంస్కృతిని పటేల్ నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మరో ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అడ్మినిస్ట్రేటర్ పటేల్పై నిరసన గళం విప్పిన లక్షద్వీప్ ప్రజలకు సంఘీభావం తెలిపారు. తక్షణమే పటేల్ ను లక్షద్వీప్ పరిపాలనాధికారి పదవి నుంచి తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ మరో ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాష్ట్రపతికి లేఖరాశారు.