RCP Singh on Nitish | బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఏడు జన్మలెత్తినా ప్రధానమంత్రి కాలేరని జేడీయూ మాజీ జాతీయ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్ ఎద్దేవా చేశారు. గత నెలలో జేడీయూ నుంచి వైదొలిగిన ఆర్సీపీ సింగ్.. తనపై కొందరు ఆగంతక కార్యకర్తలు చేసిన అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నితీశ్ సారధ్యంలోని జేడీయూను డిమాండ్ చేశారు. బీజేపీలో చేరడంతోపాటు అన్ని ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు గురువారం మీడియాతో చెప్పారు.
మరో దఫా రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడంతో కేంద్ర మంత్రిగా ఆర్సీపీ సింగ్ రాజీనామా చేశారు. బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీలతో కూడిన మహాఘట్బంధన్ కూటమితో కలిసి నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పట్ల మండిపడ్డారు. `నితీశ్కుమార్ ఎన్నిసార్లు కూటములు మారుస్తారు. ఇప్పటివరకు నాలుగు సార్లు – 1994, 2013, 2017, 2022ల్లో కూటములు మార్చేశారు` అని గుర్తు చేశారు.
ఆర్జేడీలో విలీనం చేయడం మినహా జేడీయూకు మరో ఆప్షన్ లేదని ఆర్సీపీ సింగ్ ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్కుమార్ సారధ్యంలోని జేడీయూకు వ్యతిరేకంగా, బీజేపీ తరఫున పని చేశానని తనపై వచ్చిన ఆరోపణలను కొట్టి పారేశారు. గతేడాది నితీశ్ కుమార్ ఆమోదం పొందకుండానే ఆర్సీపీ సింగ్ కేంద్ర క్యాబినెట్లో చేరారు. నాటి నుంచి నితీశ్కు, ఆర్సీపీ సింగ్కు మధ్య దూరం పెరిగింది.