నిజామాబాద్ : గ్రామాల పరిశుభ్రత, అభివృద్ధి కోసమే పల్లెప్రగతి కార్యక్రమం. ఇంటితో పాటుగా ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నాలుగో విడత పల్లెప్రగతిలో భాగంగా కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రం, నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రాలలో జరిగిన ఆయా కార్యక్రమాలలో పోచారం పాల్గొన్నారు. ఈసందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..
పల్లెలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. అలాగే పచ్చదనం, పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. నాటిన మొక్కలను సంరక్షించాలని చెప్పారు. పీల్చేగాలి, తినే తిండి, తాగునీరు శుభ్రంగా ఉంటే ఏ రోగాలు రావన్నారు. అదేవిధంగా ఇల్లు లేని పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చడమే నా ఆశయం అన్నారు.
సీఎం కేసీఆర్ దయతో మరో అయిదువేల డబుల్ బెడ్ రూం ఇండ్లను బాన్సువాడ నియోజకవర్గానికి మంజూరు చేశారు. వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు అన్నారు. రైతులు తమ కష్ట సుఖాల గురించి మాట్లాడుకోవడానికే రైతు వేదిక నిర్మాణం అని పేర్కొన్నారు. నిజాంసాగర్ ఆయకట్టుతో పాటుగా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నాన్ కమాండ్ ఆయకట్టుకు సాగునీరు అందించడానికి జాకోరా, చందూరు ఎత్తిపోతల పథకాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనుమతులు మంజూరు చేశారని తెలిపారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలమన్నారు. రోడ్లపై కేజీ వీల్ ట్రాక్టర్లను తిప్పరాదు, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీర్కూర్ మండల కేంద్రానికి నూతనంగా మంజూరైన ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించారు. ఈ ఏడాది విద్యాసంవత్సరం నుండే అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా బీర్కూర్ మండల కేంద్రం, కోటగిరి మండల కేంద్రంలలో నూతనంగా నిర్మించిన రైతువేదికలను ప్రారంభించారు. కోటగిరి మండల కేంద్రంలో మూడు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాల బాలుర హాస్టల్ ను కూడా స్పీకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రకృతి వనాలు ప్రశాంతతకు నిలయాలు
దారుణం : టీనేజ్ సోదరిపై 12 ఏండ్ల బాలుడి లైంగిక దాడి
వెదజల్లే సాగుతో అధిక దిగుబడి : మంత్రి పువ్వాడ
రెండు, మూడు రోజుల్లోవాసాల మర్రికి సీఎం కేసీఆర్ రాక