హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారతావనిలో గత 75 ఏండ్లుగా ఒక్క మౌలిక సమస్య కూడా పరిష్కారం కాలేదని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. దేశాన్ని ఎన్నో ఏండ్లు పాలించిన కాంగ్రెస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ పార్టీల గుర్తులు వేరైనప్పటికీ వాటి విధానాలు మాత్రం ఒకటేనని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా మరో పార్టీ రావాలని, అందు కు తెలంగాణ సీఎం కేసీఆర్ నడుం బిగించడం శుభపరిణామమని నమస్తే తెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
దేశంలో మరో జాతీయ పార్టీ ఏర్పాటు ఆవశ్యకత ఉన్నదా?
కచ్చితంగా ఉన్నది. దేశంలో ప్రధాన జాతీయ పార్టీలుగా కొనసాగుతున్న బీజే పీ, కాంగ్రెస్ గుర్తులు వేరైనా వాటి పాలన విధానాలు ఒక్కటే. అందుకే 75 ఏండ్లుగా దేశంలో ఎలాంటి మౌలిక సమస్యలు పరిష్కారం కాలేదు. దేశంలో అపార సహజ వనరులు, మానవ వనరులు ఉన్నా సద్వినియోగం చేసుకోలేని దుస్థితి. అందుకే మరో జాతీయ పార్టీ అత్యవసరం.
బీజేపీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ విఫలమైందని చెప్పవచ్చా?
పూర్తిగా విఫలమైందని చెప్పలేం. కాంగ్రెస్కు నాయకత్వం వహించడంలో రాహుల్ విఫలమయ్యారు. లీడర్ అనేవాడు యుద్ధం చేయాలె. ఉపన్యాసాలు ఇవ్వకూడదు. ఆ పని చేయకపోవడంతో రాహుల్ ప్రజావిశ్వాసాన్ని కోల్పోతున్నారు.
జాతీయ సమైక్యత విచ్ఛిన్నమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి? వాటి పర్యవసనాలు ఎలా ఉంటాయి?
గతంలో ముస్లింల ఓట్లు పొందేందుకు కాంగ్రెస్ రాజకీయం చేసింది. ఇప్పుడు ముస్లింలను, దళితులను విభజిస్తూ బీజేపీ రాజకీయం చేస్తున్నది. ఏదో ఒక వర్గం, ప్రాంతం, మతం, కులం ఆధిపత్యం కొనసాగితే ఆ దేశం విచ్ఛిన్నమవుతుందని అంబేద్కర్ ఎప్పుడో హెచ్చరించారు. బీజేపీ అనుసరిస్తున్న విభజన రాజకీయాలు కొనసాగితే దేశంలో అదే పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉన్నది.
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రభావం ఏమేరకు ఉంటుంది?
దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం. జాతీయ రాజకీయాలపై ఆయన కచ్చితంగా ప్రభావితం చేస్తారని నేను బలంగా నమ్ముతున్నా. కేసీఆర్కు భాషా పరిజ్ఞానంతోపాటు ప్రజాసమస్యలపై పూర్తి అవగాహన, వాటిని పరిష్కారించాలనే చొరవ ఉన్నది. అలాంటి నాయకుడిని ఎవరూ కాదనరు.
గుజరాత్ మాడల్పై అభిప్రాయం?
గుజరాత్ మాడల్ అనేది అసలు మాడలే కాదు. అక్కడ సామాజిక మార్పులు జరగలేదు. రక్షణ లేదు. ఆర్థిక రక్షణ విధానాలు లేవు. సంక్షేమం లేదు. పెట్టుబడిదారులను జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఎగుమతి చేయడమే గుజరాత్ విధానం. వ్యాపార వర్గాలు, ఆధిపత్య కులాల ప్రయోజనాలను కాపాడటమే ఆ మాడల్ విధానం. అది దేశానికి క్షేమదాయకం కాదు.
తెలంగాణ అభివృద్ధి నమూనాకు, ఇతర రాష్ర్టాల విధానాలకు తేడా?
దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇంతటి ప్రజానుకూల వాతావరణం లేదని చెప్పవచ్చు. ఇక్కడ విద్య, వైద్య రంగాల్లో దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, బీసీలు సాధిస్తున్న మార్పులు అనేకం. దళితబంధు లాంటి అద్భుత కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. రైతుబీమా, ఉచిత కరెంటు రైతుల ఆర్థికాభ్యున్నతికి తోడ్పడుతున్నాయి. పారిశ్రామికంగానూ తెలంగాణ పురోగమిస్తున్నది. ఏ రాష్ట్రం కూడా అనుసరించని సమ్మిళిత అభివృద్ధి నమూనాను తెలంగాణ ఆచరిస్తున్నది.