సిరికొండ : పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు పట్టాలు పంపిణీ చేస్తే కేసీఆర్ను ఆదివాసీలు ఎన్నటికీ మరిచిపోలేరని ఆదివాసీ నాయకులు అన్నారు. రాష్ట్రంలో పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వనున్నట్లు కేసీఆర్ అంబ్లీలో ప్రకటించడంతో శనివారం మండల కేంద్రంలో కొమరం భీం చౌక్ వద్ద మండల తుడుందెబ్బ, ఆదివాసీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ మండలాధ్యక్షుడు యాదవ్ రావ్ మాట్లాడుతూ..గిరిజనులు ఉపాధి కోసం భూములను సాగు చేసుకుంటున్నారని, వారికి భూమిపై ఎలాంటి హక్కులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి పట్టాలు ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. లంబాడీలు మహరాష్ట్ర నుంచి అక్రమంగా వలసలు వచ్చి ఎస్టీ సర్టిఫికేట్ తీసుకుంటున్నారని కేసీఆర్ ప్రకటించి తమ సమస్యను గుర్తించడం సంతోషకరమని తెలిపారు.కార్యక్రమంలో కొమరం భీం ఆశయ సమితి అధ్యక్షుడు కోట్నాక్ పాండు, ఆదివాసీ నాయకులు నాగోరావ్, బారిక్ రావ్, అమృత్ రావ్, మహదు, లక్ష్మణ్ దేవ్ రావ్, జంగు, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.