హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): ఎన్ని అబద్ధాలు చెప్పినా.. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఎంత అసత్య ప్రచారం చేసినా.. తెలంగాణ ప్రజలు తమ పార్టీని నమ్మే పరిస్థితి లేదని బీజేపీ నేతలకు అర్థమైనట్టే కనిపిస్తున్నది. దీంతో బెంగాల్ తరహా ప్రణాళికను ఇక్కడ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నది. చిన్న అంశాన్ని భూతద్దంలో చూపి.. గొడవలు, ఘర్షణలు చెలరేగేలా చేయడమే బీజేపీ ప్లాన్. తద్వారా రాష్ట్ర ప్రజలను, ప్రభుత్వాన్ని ప్రశాంతంగా ఉండనీయకుండా.. ఎప్పుడూ ఏదో ఒక రచ్చతో తలనొప్పి తెచ్చిపెట్టడమే దాని లక్ష్యం.
బెంగాల్లో ఎన్నికలకు ముందు ఈ ప్రణాళికను బీజేపీ పక్కాగా అమలు చేసింది. గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు అల్లర్లు, హత్యలు.. ఇలా రోజుకో విధ్వంసం సృష్టించింది. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే తరహా అమలు చేస్తామని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్షా తుక్కుగూడ సభలో పరోక్షంగా సంకేతాలిచ్చారు. అవసరం లేకున్నా తన ప్రసంగంలో ‘బెంగాల్’ ప్రస్తావనను తీసుకొచ్చారు. ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. అతడు ఆత్మహత్య చేసుకుంటే.. ‘అతడిని చంపినవారిని జైళ్లకు పంపిస్తాం’ అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న సంఘటనను.. రెచ్చగొట్టే రాజకీయాల్లో భాగంగా హత్య చేసినట్టుగా ఏకంగా కేంద్ర హోంమంత్రి చెప్పడం తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.