కేసీఆర్ చేపట్టిన ప్రతి పనీ.. మొదట్లో సాధ్యమేనా? అనిపించేలా ఉంటుంది. కానీ ఆయన దార్శనికత, పకడ్బందీ కార్యాచరణ దానిని సుసాధ్యం చేస్తుంది. ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టాలన్న నిర్ణయం కూడా ఆషామాషీ ఏం కాదు. మెదడు రంగరించి.. భవితను స్వప్నించి తీసుకొన్నది. ఇది జాతీయ మలుపు.. జాతికి పిలుపు.
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఈ దేశంలో గత ఎనిమిదేండ్లలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. పరిపాలన పంథా దారితప్పింది. రాష్ర్టాలను బలహీనం చేయడం ద్వారా.. కేంద్రాన్ని బలోపేతం చేసి.. పూర్తిగా తనపై ఆధారపడేలా ప్రాంతీయ అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసే ధోరణి ప్రబలింది. మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ పరిణామాలు వేగంగా మారిపోయాయి.
జాతి అస్తిత్వమే ప్రధాన ఎజెండాగా సాగుతున్న పరిపాలనలో ప్రాంతీయ అస్తిత్వానికి ఉనికి లేకుండా చేయడమే లక్ష్యంగా బీజేపీ ధోరణి సాగుతున్నది. ఇదే దూకుడు.. ఇదే పెత్తందారీ విధానం కొనసాగితే.. సమీప భవిష్యత్తులో ప్రాంతీయ అస్తిత్వం ప్రమాదంలో పడుతుందనడంలో సందేహం లేదు. ప్రాంతీయ అస్తిత్వం ప్రమాదంలో పడటం అంటే.. ప్రాంతీయ పార్టీల మనుగడకు ముప్పు ముంచుకొచ్చినట్టే. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే నిర్దిష్టమైన ప్రత్యామ్నాయ ఎజెండాతో జాతీయ స్థాయిలో నిర్మాణాత్మకంగా రాజకీయ పార్టీ అవసరం తప్పనిసరి అయింది.
మిత్రులు లేరు.. శత్రువులూ లేరు
మోదీ బీజేపీ ప్రధాన ఎజెండా జాతి అస్తిత్వం. భిన్నమైన నాగరికతలు, భాషా సంస్కృతులు, ఆచార వ్యవహారాలు ఉన్న దేశంలో జాతీయత పేరుతో ప్రాంతీయ అస్తిత్వాన్ని దారుణంగా ప్రమాదంలోకి నెట్టేసింది. ఈ క్రమంలో మిత్రులు, శత్రువులు ఎవరూ కనిపించరు. ఎవరైనా సరే.. తమ ఆధిపత్యాన్ని అంగీకరించి ఉంటే ఉంటారు.. లేకుంటే పోతారు అన్న బీజేపీ నిరంకుశ ధోరణి.. పార్టీ ఏర్పడిన నాటినుంచి వెన్నంటి ఉన్న శివసేన, అకాలీదళ్, జేడీయూ వంటి పార్టీలను దూరమయ్యేలా చేసింది. ఇంకోపక్క ఈశాన్య రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలను పూర్తిగా బలహీనం చేసింది.
కశ్మీర్లో పీడీపీ, కర్ణాటకలో జేడీఎస్ను, తమిళనాడులో అన్నాడీఎంకేను మళ్లీ పుంజుకోని పరిస్థితిలోకి నెట్టేసింది. బీజేపీ ఆధిపత్యాన్ని అంగీకరించిన ఒకటో రెండు పార్టీలను మినహా మిగతా అన్ని పార్టీలపైనా ఉక్కు పిడికిలి బిగిస్తున్నది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి చోట్ల రాజకీయ అనిశ్చితి సృష్టించి అధికారాన్ని హస్తగతం చేసుకొన్నది. భారతదేశం రాష్ర్టాల సమాహారం (ఇండియా యూనియన్ ఆఫ్ స్టేట్స్) అని రాజ్యాంగం మొదటి ప్రకరణే స్పష్టం చేస్తున్నది.
ఈ మౌలిక లక్ష్యానికే బీజేపీ చరమగీతం పాడింది. తనకు అవసరం అనుకొంటే ప్రాంతీయ పార్టీలను వాడుకోవడం.. అవసరం తీరాక వాటిని నిర్వీర్యం చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. సాక్షాత్తూ ప్రధానమంత్రి స్వయంగా రాజస్థాన్లో 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని ఇటీవల చెప్పారంటేనే.. బీజేపీ ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. దీర్ఘ కాలిక లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతున్నది. బీజేపీ ఏర్పాటు వెనుక ప్రధాన లక్ష్యం ఇదే అయినప్పటికీ.. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కుట్ర అమలు వేగం పుంజుకొన్నది. ఈ పరిస్థితిని గట్టిగా ఎదుర్కోవడానికి ఒక దృఢమైన ప్రత్యామ్నాయ వ్యవస్థ తప్పనిసరి అయింది. దేశంలో బహుళత్వాన్ని పరిరక్షించాలంటే మరో జాతీయపార్టీ మినహా మరో మార్గం లేదనే వాతావరణం నెలకొన్నది.
పాలన అంటే లాభ నష్టాల వ్యాపారమేనా?
మోదీ పాలనలో ప్రభుత్వం అంటే లాభ నష్టాలు బేరీజు వేసుకొనే వ్యాపార సంస్థలా మారిపోయింది. విద్యుత్తు మార్కెట్ ధరకు కొనుక్కోవాలి. గ్యాసు మార్కెట్ ధరకు కొనుక్కోవాలి. నిత్యావసరాలు, పెట్రోలు.. ఇలా ప్రతీదీ మార్కెట్ ఆధారితంగా ప్రజలు అందుకోవాలి. భారతదేశం సంక్షేమరాజ్యమని మనం లిఖించుకొన్న రాజ్యాంగ లక్ష్యాల స్ఫూర్తిని పూర్తిగా మార్చివేస్తున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే సంక్షేమానికి నిర్వచనాన్నే మార్చివేసింది. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో అనేక అంశాలను చేర్చారు.
ఈ అంశాలు కేంద్రం, రాష్ర్టాలు ఉమ్మడిగా నిర్వహించాలని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం వీటన్నింటినీ ఒక్కటొక్కటిగా తన చేతుల్లోకి తీసుకొంటున్నది. రాజ్యాంగం ప్రవచించిన సమాఖ్యస్ఫూర్తికి క్రమంగా తూట్లు పొడుస్తున్నది. జీఎస్టీ పేరుతో పన్నుల వ్యవస్థ, సంస్కరణల పేరుతో విద్యుత్తు.. దొడ్డిదారి చట్టాలతో వ్యవసాయం.. ఒక్కటే విద్యావిధానం పేరుతో విద్యారంగాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా పట్టు బిగించింది. రాష్ర్టాలవారీగా విభిన్నంగా ఉన్న ఈ రంగాలన్నింటికీ ఒక ఏకరూపత తేవాలనే కుట్ర పన్నుతున్నది.
ఇందుకోసం రాష్ర్టాల గొంతు నొక్కుతున్నది. బలహీనం చేస్తున్నది. బహుముఖీనమైన ప్రాంతీయత్వమే భారతదేశ అస్తిత్వం. ఈ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి విస్తృత జాతీయ వేదిక అవసరం. బీజేపీ నిరంకుశ పోకడలను బలంగా నిలువరించడానికి జాతీయ పక్షం అనివార్యమవుతున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దిశగా ఒక్కడై కదులుతున్నారు.
జాతీయ రాజకీయాల్లో శూన్యత
బీజేపీ అధికారంలోకి రావడానికి ముందు పదేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్లో ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది. కాంగ్రెస్ బలహీనం కావడంతో ఆ శూన్యతను సంపూర్ణం చేయడంలో ప్రాంతీయ పార్టీలు విఫమయ్యాయి. మరోపక్క ములాయం, లాలూ, శరద్యాదవ్ వంటి సీనియర్ నేతలు జాతీయ రాజకీయ యవనికపైనుంచి కనుమరుగైపోయారు. సోషలిస్టు, కమ్యూనిస్టు భావజాలాలు ప్రాసంగికతను కోల్పోయాయి. ఈ దశలో దేశాభివృద్ధే ఎజెండాగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ నిర్మాణం అవసరమైంది.
ఈ అంశం గురించే ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెప్తున్నారు. ‘పార్టీల జెండాలు.. వాటి ఎజెండాలు కాకుండా.. ప్రజల ఎజెండా దేశానికి కావాలి. ఈ దేశాన్ని గాడిన పెట్టాలంటే మరో వేదిక రావాలి. ఆ వేదికకు తెలంగాణే నాయకత్వం వహించాలి’ అనే ఆకాంక్షను కేసీఆర్ ఇటీవల అనేక బహిరంగ సభల్లో.. సమావేశాల్లో గొంతెత్తి నినదించారు. ఇది రాజకీయ నినాదం కాదు.. ప్రజల ప్రగతి నినాదం. ఈ దిశగానే కేసీఆర్ జాతీయ పార్టీ నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నారు.