‘75 ఏండ్ల భారత్ ఆర్థికవ్యవస్థ ఇంకా అచేతనావస్థలో ఉన్నది. వ్యవసా యం, పారిశ్రామికంలో చాలా వెనుకబడి ఉన్నాం. ఉపాధి కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు బాట పడుతున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగిస్తున్నది. ఇది అత్యంత దుర్మార్గం. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోతారు. ప్రైవేటు రంగం సురక్షితం కాదు. జవాబుదారీతనం ఉండదు. కార్పొరేట్ల రాజ్యం నడుస్తున్నది. చిన్నాచితక వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో దేశాన్ని నడిపించే కొత్త శక్తి కావాలి. ఆ శక్తి కేసీఆర్లో పుష్కలంగా ఉన్నది’ అన్నారు జాతీయ ట్రేడ్ యూనియన్ నాయకుడు నింబాల్కర్. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయరంగ ప్రవేశం, టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మార్పుచెందడంపై ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై మీ అభిప్రాయం ?
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ఆయన ప్రతీక. జాకీర్ హుస్సేన్, సరోజినీ నాయుడు, అంజయ్య, పీవీ నరసింహారావు వంటి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొన్న నాయకుడు. గొప్ప నాయకత్వ పటిమ కలిగిన నేత.
బీజేపీని నిలువరించే సత్తా కేసీఆర్కు ఉందా ?
దేశంలో బీజేపీని ఢీకొట్టగలిగే ఏకైక నేత కేసీఆర్ ఒక్కరే. వాగ్ధాటి, చరిష్మా ఉన్న నాయకుడు. గొప్ప పరిపాలన దక్షత కలిగినవాడు. రాష్టాన్ని సాధించి ఆదర్శంగా తీర్చిదిద్దిన గొప్ప నేత. సామాన్యుల భాషలో మాట్లాడి మెప్పించే సత్తా ఆయన సొంతం. జనబాహుళ్యాన్ని కదిలించగలరు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్లో అనర్గళంగా మాట్లాడి ఆకట్టుకొంటారు. ఏది కూడా నోటి మాటగా చెప్పరు. నిర్దిష్టంగా, గణాంకాలతో సహా అధ్యయనం చేసిన తర్వాతే మాట్లాడతారు. విలక్షణ శైలి వల్లే కేసీఆర్ మాస్ లీడర్గా ఎదిగారు.
మోదీ ఎనిమిదేండ్ల పాలనపై మీ కామెంట్ ?
దేశప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. కార్పొరేట్ శక్తుల మానసపుత్రిక బీజేపీ. క్రోనీ క్యాపిటలిస్ట్. కార్పొరేట్ల అనుకూల విధానాలనే అమలు చేస్తున్నది. మతప్రాతిపదికన పాలన సాగిస్తూ రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నది. ఇది దేశ ప్రగతికి చాలా ప్రమాదకరం.
బీజేపీని నిలువరించడంలో కాంగ్రెస్ విఫలమైందంటారా?
మోదీని నిలువరించగల శక్తి రాహుల్గాంధీకి లేదు. ఆయన రాజకీయ అనుభవం సరిపోదు. మోదీకి దీటుగా దేశంలో ఉన్న ఏకైక నాయకుడు కేసీఆర్ ఒక్కరే.
గుజరాత్ మాడల్పై మీ అభిప్రాయం ?
బీజేపీ తియ్యని మాటలతో కాలం వెళ్లదీస్తున్నది. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నది. ఇందుకు నల్లధనం వెనక్కి తెస్తామని చెప్పడమే ఉదాహరణ. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం. వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టుతున్నది. గుజరాత్ అభివృద్ధి నమూనా అంతా బూటకం. అన్నింట్లోనూ తిరోగమనమే. తెలంగాణ సాధిస్తున్న ప్రగతి అద్భుతం.