హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ అధ్యక్షునిగా సీఎం కేసీఆరే కొనసాగాలని పార్టీ శ్రేణులు ప్రగాఢంగా వాంఛిస్తున్నాయి. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ నామినేషన్లు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ తాజాగా టీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు నామినేషన్ దాఖలు చేశారు. గురువారం తెలంగాణభవన్లో పార్టీ అధ్యక్ష ఎన్నికల అధికారి మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డికి నామినేషన్ పత్రాలను అందించారు. వీరిలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మహిళా విభాగం అధ్యక్షురాలు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబుయాదవ్, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రూప్సింగ్, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిక్కసాని నాగేశ్వర్రావు, వేముల మారయ్య, ప్రధాన కార్యదర్శి నారాయణ, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముజీబ్, విద్యార్థి సంఘం నాయకుడు స్వామి తదితరులు ఉన్నారు.
నేటితో టీఆర్ఎస్ నామినేషన్ల పర్వం పూర్తి
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామనేషన్ల స్వీకరణ గడువు శుక్రవారంతో ముగియనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ను పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ ఇప్పటివరకు మొత్తం 16 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.