ఖమ్మం/భద్రాచలం, సెప్టెంబర్ 6: ఇటీవల గోదావరి వరదలు వచ్చి భద్రాచలం వద్ద ప్రజలు నిరాశ్రయులవుతుంటే సీఎం కేసీఆర్ దేవుడిలా వచ్చి అక్కడి వారిని రక్షించారని రాష్ట్ర రవాణా శాఖ మంతి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. జోరున వర్షం కురుస్తున్నా, వరదలు ఉధృతంగా పారుతున్నా సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన భద్రాచలం వచ్చి అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చారని గుర్తుచేశారు. ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని భద్రాచలానికి ప్రమాదం పొంచి ఉందని అన్నారు. దాని నివారణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర జల సంఘం, గోదావరి నదీ యాజమాన్య బోర్డు కూడా సరైన అధ్యయనం చేయాలని కోరారు.
కేంద్రం నిర్వాకం వల్ల ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తుండడంతో భద్రాచలం ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందంటూ మంత్రి అజయ్కుమార్ మంగళవారం అసెంబ్లీలో గళమెత్తారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని గుర్తుచేశారు. అయినా కేంద్రం స్పందించలేదని విమర్శించారు. టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ వరదలపై సీడబ్ల్యూసీ కూడా ముందస్తుగా అప్రమత్తం చేయలేదని ఆరోపించారు. బ్యాక్ వాటర్, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇతరత్రా అంశాలపై కేంద్రం ఇప్పటికీ స్పందించలేదని విమర్శించారు. గోదావరి పరీవాహకంలో ముంపు ప్రాంత ప్రజలకు శాశ్వత పరిష్కారం చూసేందుకు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.