చిన్నప్పటి నుంచే చురుకైన వ్యక్తి…
సీఎం కేసీఆర్కు మేధాశక్తి ఎక్కువ. చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండేవారు. పాఠశాల స్థాయిలో చదువు చెప్పిన గురువులు అంటే ఆయన చాలా ప్రేమ, అభిమానం. కేసీఆర్కు చిన్నతనంలో తెలుగు వ్యాకరణం, భాషపై పట్టుసాధించారు. సీఎం కేసీఆర్ పదో తరగతి దుబ్బాక ఉన్నత పాఠశాలలోనే చదువుకున్నారు. విద్యా సంవత్సరం చివరి మూడు, నాలుగు నెలల ముందు ఇక్కడి నుంచి పుల్లూరు హైస్కూల్కు వెళ్లి, అక్కడే పదో తరగతి పరీక్షలు రాసి కృతార్థులయ్యారు. చింతమడక నుంచి ప్రతిరోజూ దుబ్బాక వరకు కాలినడకనే వెళ్లేవారు. తర్వాత కొన్ని రోజులకు చింతమడక గ్రామానికి చెందిన రాఘవారెడ్డి అనే హిందీ పండితుడు ఇదే పాఠశాలలో పనిచేసేవాడు. ఆయన దుబ్బాకలోనే నివాసం ఉండటంతో కేసీఆర్, ఆయన సోదరి సుమతి వారి ఇంట్లోనే ఉండేవారు.
పాఠశాలలో సాంస్కృతిక ప్రదర్శనల్లో భాగంగా పౌరాణిక నాటకాల్లో కూడా కేసీఆర్ పాత్రలు వేసేవారని అతని మిత్రులు చెబుతుంటారు. శ్రీకృష్ణ పాండవీయం నాటకంలో పంచ పాండవుల్లో చివరి వాడైన సహదేవుని పాత్రను కేసీఆర్ పోషించాడని చెబుతారు. పాఠశాల విద్యార్థి సంఘం నాయకత్వానికి జరిగిన పోటీలో కూడా ఉపాధ్యక్షుడిగా కేసీఆర్ పని చేశారు. ఆయన విద్యార్థి దశలో ఒకటో తరగతి నుంచి రెండో తరగతి వరకు అంకంపేట, మూడో తరగతి చింతమడకలో, నాల్గో తరగతి నుంచి పదో తరగతి వరకు దుబ్బాకలో చదువుకున్నారు. అనంతరం ఉన్నత చదువులు సిద్దిపేటలో చదువుకున్నారు. పాఠశాల స్థాయి నుంచే రాజకీయాల్లో అమితాసక్తి చూపారు. అప్పట్లో విద్యార్థి సంఘాల ఎన్నికల్లో పాల్గొని విజయాలు సాధించారు. రాజకీయంగా జన్మనిచ్చిన సిద్దిపేట అంటే కేసీఆర్కు ఎంతో అభిమానం. చదువుకున్న కళాశాల అన్నా అమితాసక్తి.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని స్వాగతిస్తున్న సొంతూరు చింతమడక గ్రామస్తులు
ఉద్యమ గడ్డలో చారిత్రాత్మక దీక్షలు..
సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను సీమాంధ్ర ప్రభుత్వం కుట్ర పన్ని పోలీసుల చేత భగ్నం చేయడంతో ఒక్కసారిగా తెలంగాణ భగ్గుమన్నది. ఉద్యమ పురిటిగడ్డ సిద్దిపేటలోని దీక్షా శిబిరం వద్ద చరిత్రలో నిలి చిపోయేలా దీక్షలు చేపట్టారు. నంగునూరు మండలం పాలమాకుల వద్ద దీక్షలు కొనసాగాయి. హరీశ్రావు ఆధ్వర్యంలో సిద్దిపేట దీక్షా శిబిరం 1531వ రోజుల పాటు కొనసాగింది. దీక్షా స్థలికి ఎంతోమంది మేధావులు, నాయకులు, ప్రముఖులు వచ్చి సంఘీభావం తెలిపారు. కేసీఆర్ పలుసార్లు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపి మాట్లాడారు. మహిళా సంఘాలు, జేఏసీ నాయకులు దీక్షలో కూర్చుని విజయవంతం చేశారు. పాలమాకుల దీక్షా శిబిరం వెయ్యి రోజుల పాటు కొనసాగాయి. ఈ దీక్షలో సుమారుగా 16 వేల మంది మహిళలు కూర్చుని రాష్ట్రం వచ్చేదాకా నినదించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మార్చి 13న సిద్దిపేట దీక్షలు, మార్చి 9న పాలమాకుల దీక్షలను విరమింపజేశారు. సిద్దిపేటలో 1531 రోజుల పాటు దీక్షా స్మృతులకు గుర్తుగా పైలాన్ నిర్మించారు.