నెట్వర్క్, నమస్తే తెలంగాణ, అక్టోబర్ : టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా సీఎం కేసీఆర్ ప్రకటించడంపై జిల్లా వ్యాప్తంగా సంబురాలు నిర్వహించారు. గులాబీ శ్రేణులు ఆనందోత్సాహాలతో పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఆయా సంఘాల నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. జై కేసీఆర్.. జై భారత్ నినాదాలు మార్మోగాయి. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభ పరిణామమని పలువురు పేర్కొన్నారు.
యాదగిరిగుట్ట : సంబురాల్లో పాల్గొన్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు వెంకటయ్య, కార్యకర్తలు
పెన్పహాడ్లో సంబురాల్లో పాల్గొన్న ఎంపీపీ భిక్షం, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు
సీఎం కేసీఆర్తో దేశ భవిష్యత్ మారిపోతుంది..
సీఎం కేసీఆర్తో దేశ భవిష్యత్ మారిపోతుంది. దేశం బాగుపడాలని కేసీఆర్ తపిస్తున్నారు. వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టించేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అనంతరం తెలంగాణలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతున్నది. ఎనిమిదేండ్లలోనే తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కావాలనుకుంటున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి దేశంలో కూడా ప్రవేశపెట్టాలని ఆయా రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారు. 75ఏండ్లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యాయి. దేశంలో పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, ఆకలి, అసమానతలు పెరిగిపోవడానికి ఆ రెండు పార్టీలే కారణం. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తూ, దేశ సంపదను బహుళ జాతి కంపెనీలకు దోచిపెడుతున్నది. ఈ తరుణంలో మోదీని ఢీకొట్టేందుకు కేసీఆర్ వంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లో ఉండాలి.
– నారబోయిన స్వరూపారాణి, జడ్పీటీసీ (మునుగోడు)
చరిత్రను తిరగరాయగల సమర్థుడు కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రను తిరగరాయగలిగిన సమర్థుడు. దేశంలోని అన్ని రాష్ర్టాలు కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనియాడుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా సుపరిపాలన అందిస్తూ ప్రజల మనసుల్లో చిరస్థానం సంపాదించుకున్నారు. ఉద్యమ నేపథ్యంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీని ప్రజలంతా విశ్వసిస్తున్నారు. దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న కేసీఆర్ వెన్నంటే దేశ ప్రజలు నడిచేందుకు సమాయత్తంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో సునాయాసంగా చొచ్చుకుపోతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ పాలనతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ స్థాపనతో ప్రజల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి.
– జనగాం పాండు, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు కలెక్టరేట్)
కేసీఆర్తోనే దేశంలో నవ శకం..
పట్టువీడని విక్రమార్కుడిలా సబ్బండ వర్గాలను ఏకం చేసి రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు సీఎం కేసీఆర్. ఎందరో త్యాగధనుల పోరాట స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు నడిపిస్తున్న నేత. ఎనిమిదేండ్లలో ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో రాష్ర్టాన్ని నంబర్ వన్ స్థానంలో నిలిపి యావత్తు దేశం దృష్టిని తెలంగాణ వైపు మళ్లించారు. అపార అనుభవం, రాజకీయ చతురత, మేథోశక్తితోపాటు అనుకున్నది సాధించేదాకా పట్టు వీడని నైజమున్న కేసీఆర్ సేవలను దేశ ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసి నవ శకానికి నాంది పలికారు. జాతీయ పార్టీతో దేశంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. మేమంతా సీఎం కేసీఆర్ వెన్నంటే ఉంటూ పూర్తి సహకారం అందిస్తాం. జాతీయ పార్టీ స్థాపించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– కరాటే బాలు, రేణికుంట (రాజాపేట)
సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు..
ప్రత్యేక విజన్ ఉన్న సీఎం కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసినట్లుగానే దేశాన్ని కూడా ప్రగతి పథంలో నడిపిస్తారు. దశాబ్దాలుగా ఉత్తరాది పార్టీలకు చెందిన నాయకులు ఢిల్లీ పీఠంపై కూర్చొని మన రాష్ర్టాన్ని చిన్న చూపు చూస్తున్నారు. ముఖ్యంగా రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు ప్రతిసారీ అన్యాయమే జరుగుతున్నది. ఇక్కడ సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నుల పేరుతో దోచుకుంటున్నది. పేదోళ్లపై కనికరం లేకుండా వ్యవహరిస్తున్నది. పెరిగిన గ్యాస్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరల పెంపుతో పూట గడవడమే కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితిలో జాతీయ స్థాయిలో కేసీఆర్ వంటి విజన్ ఉన్న నాయకులు అవసరం. దేశంలో బీఎస్ఆర్ పార్టీ కీలకంగా మారితే ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం ఖాయం.
– గుగులోతు సురేందర్నాయక్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకుడు, నూతనకల్
కేసీఆర్ సారు దేశానికి పెద్దకొడుకు అయితడు..
14 ఏండ్లు పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చిన కేసీఆర్ సారు రాష్ర్టాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఒంటరి మహిళలకు పింఛన్లు, బతుకమ్మ చీరెలు ఇస్తూ ఆడోళ్లకు అన్నగా.. పెద్ద కొడుకుగా.. మేనమామగా మారిండు. దేశంలోని మోదీ మాత్రం ప్రజలను ఇబ్బందుల పాల్జేస్తుండు. గ్యాస్, నూనె, పప్పులు అన్ని వస్తువుల రేట్లు పెంచిండు. గ్యాస్ కొనలేని స్థితికి తీసుకొచ్చి మహిళలను కష్టాల పాల్జేస్తుండు. ఈ సందర్భంలో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలకు వెళ్లాడం చాలా మంచిది. ఆయన రాష్ట్రంలోని మహిళలను ఎలా ఆదుకుంటుండో.. దేశంలోని మహిళలకు కూడా అలాగే అండగా నిలిచి భరతమాత పెద్ద కొడుకు అయితడు.
– కానుగుల లక్ష్మి, శివాజీనగర్, నల్లగొండ (నీలగిరి)
దేశ రైతులకు కేసీఆర్తోనే న్యాయం..
భారతదేశంలో మొదటి నుంచీ ఒక్కటే నినాదం జై జవాన్ – జై కిసాన్. వ్యవసాయంపై ఆధారపడిన మన దేశంలో గత, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాలు ఆ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో రైతులు విలువలు కోల్పోతున్నారు. రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణలో రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. 24గంటల ఉచిత కరంటుతోపాటు అనేక పథకాలు అమలు చేయడంతో వ్యవసాయం పండుగలా మారింది. రైతులకు భరోసా, గౌరవం పెరిగింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడులు భారీగా పెరిగాయి. అన్ని వర్గాల సంక్షేమానికి అనేక వినూత్న పథకాలు అమలు చేస్తున్నారు. దాంతో ఇరత రాష్ర్టాల ప్రజలు ఇక్కడి పథకాలు, పాలన కావాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించి దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం హర్షణీయం. దేశంలో రైతులను ఆదుకోవడానికి, దోపిడీకి గురవుతున్న జాతి సంపదను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మార్చడాన్ని స్వాగతిస్తున్నాం. దేశంలోని రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్తోనే న్యాయం జరుగుతుంది.
– కొలుపుల అమరేందర్, రైతుబంధు సమితి యాదాద్రి జిల్లా అధ్యక్షుడు (భువనగిరి అర్బన్)
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికే బీఆర్ఎస్..
దేశంలోని బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. దేశంలోని ప్రజల ఆకాంక్ష మేరకు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా అవతరించింది. తెలంగాణలోని పథకాలు దేశం మొత్తం అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో జాతీయ పార్టీ ఏర్పాటుతో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ అనతికాలంలోనే దేశంలో ఒక బలమైన శక్తిగా మారడం ఖాయం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో అత్యధిక సీట్లు సాధించి కేంద్రంలో కేసీఆర్ కీలకంగా మారితే దేశ ముఖ చిత్రం సమూలంగా మారుతుంది. దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీ విధానాలను గమనిస్తున్న ప్రజలు బీఆర్ఎస్ మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయమని భావిస్తున్నారు.
– నామిరెడ్డి రవీనాకరుణాకర్రెడ్డి, మాజీ ఎంపీపీ (వేములపల్లి)
కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నాం..
రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలుగా మేలు చేస్తున్న సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ స్థాపించడం శుభ పరిణామం. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల దేశంలోని రైతులందరికీ మేలు జరుగుతుంది. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెట్టేలా వ్యవహరిస్తున్నది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని ప్రతిపాదించింది. దాంతోపాటు ఎరువులు, పురుగుమందులు, అన్ని వస్తువుల ధరలు పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయడాన్ని దేశ ప్రజలందరూ స్వాగతిస్తున్నారు.
– ఆంగోతు రంగా, చాంప్లతండా (అడవిదేవులపల్లి)
కేంద్రంలో రైతు రాజ్యం రానుంది..
స్వతంత్ర భారత దేశంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలూ రైతుల పక్షాన నిలువలేదు. దశాబ్దాలుగా కేంద్రంలో పాలించిన ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ముకాశాయే తప్ప.. రైతాంగాన్ని పట్టించుకోలేదు. రైతులకు రాయితీలు సక్రమంగా ఇవ్వకపోవడంతో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడింది. రైతులు బాగుంటేనే ఊరు, రాష్ట్రం, దేశం బాగుంటుందని సంకల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించి ఆదర్శంగా నిలిపారు. తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగలా చేసిన కేసీఆర్ కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో జాతీయ పార్టీ ఏర్పాటు చేయడం సంతోషకరం. టీఆర్ఎస్తో రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందిందో బీఆర్ఎస్ పార్టీతో దేశంలో కూడా రైతు రాజ్యం రానున్నది.
– పలుగుల ఉమారాణి, రైతుబంధు సమితి
జిల్లా సభ్యురాలు (తుర్కపల్లి)