తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో కీలక మలుపు చోటుచేసుకున్నది. దసరా పర్వదినాన పార్టీ అధినేత, సీఎం ‘తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ని భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మారుస్తూ ప్రకటన వెలువరించగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంబురాలు అంబరాన్నంటాయి. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా రోడ్లపైకి వచ్చి పటాకులు కాల్చి.. కేక్లు కట్ చేసి.. మిఠాయిలు పంచుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాలు, సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. ‘జయహో కేసీఆర్.. దేశ్కీ నేత’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ‘నాడు తెలంగాణ కోసం టీఆర్ఎస్.. నేడు దేశం కోసం బీఆర్ఎస్’ అని, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం దేశానికి శుభసూచకమని పేర్కొన్నారు. కాగా.. ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే)లో రూ.66 వేల విలువైన సోయా పంటను విరాళంగా ప్రకటించారు. బాసర సరస్వతీ ఆలయంలో వేదపండితులు, నాయకులు ప్రత్యేక పూజలు చేశారు.
బాసర : ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న బీ(టీ)ఆర్ఎస్ నాయకులు
ఆదిలాబాద్/నిర్మల్, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీని భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా రూపాంతరం చేస్తూ బుధవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. బీ(టీ)ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సంబురాలతో పండుగ వాతావరణం తలపించింది. ఆనందోత్సాహాల నడుమ పటాకులు కాలుస్తూ, మిఠాయిలు తినిపించుకున్నారు. బైక్ ర్యాలీలు నిర్వహించి బీఆర్ఎస్ ఏర్పాటుకు సంఘీభావం ప్రకటించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లలో పటాకులు కాల్చి కేసీఆర్ ప్రధాని కావాలంటూ నినాదాలు చేశారు.
ఆదిలాబాద్లో పటాకులు కాల్చి సంబురాలు జరుపుకుంటున్న బీ(టీ)ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు
ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి చౌక్లో మున్సిపల్ చైర్మన్ రాజేందర్ ఆధ్వర్యంలో బీ(టీ)ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, స్వీట్లు పంచిపెట్టారు. ముథోల్ నియోజకవర్గంలోని భైంసాలో పార్టీ పట్టణాధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచిపెట్టారు. బాణాసంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు. బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. సోన్, సారంగాపూర్ మండలాల్లో కూడా స్థానిక నాయకులు బీఆర్ఎస్ ఆవిర్భావంతో సంబురాలు జరుపుకున్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతోపాటు బీ(టీ)ఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో బీ(టీ)ఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పటాకులు కాల్చి సంబురాలు చేశారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో పటాకులు కాల్చారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం సరిహద్దు గ్రామం కరంజి(టి)లో మహిళలు, పింఛన్దారులు, రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే)లో దళితులు కేసీఆర్ దళితబస్తీ కింద ఇచ్చిన భూమిలో పండిన రూ.66 వేలు విలువ గల సోయా పంటను విరాళంగా ప్రకటించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఉట్నూర్ : ఐబీ చౌరస్తాలో
ఖానాపూర్ టౌన్ : తెలంగాణ తల్లి విగ్రహం వద్ద..
నిర్మల్ అర్బన్ : బైక్ ర్యాలీ..
దస్తురాబాద్ : ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు