హాజీపూర్, సెప్టెంబర్ 29 : దళితుల జీవితాల్లో వెలుగులను నింపేందుకు దళిత బంధు పథకం ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని బస్టాండ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గా ప్రసాద్, దళిత సంఘాల నాయకులతో కలిసి పూలమాల వేశారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన పడ్తన్పల్లిలో ఎస్సీ కాలనీతో పాటు రాపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలను ముంపు కాలనీలుగా ప్రకటించి నష్ట పరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకుల చైర్మన్ దృష్టికి తీసుకు వెళ్లారు.
మొదటి విడుతలో మండలంలోని పడ్తన్పల్లిలో దళిత బంధు పథకంలో లబ్ధిపొందిన 43 మంది లబ్ధిదారులతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ దళితబంధు తీసుకున్న దళితులతో క్షేత్రస్థాయిలో పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడేందుకే ఇక్కడికి వచ్చానని, నాడు డ్రైవర్గా పని చేసిన వ్యక్తి నేడు యజమానిగా మారాడని, ఈ మార్పు కేసీఆర్తోనే సాధ్యమైందన్నారు. అసెంబ్లీకి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిన మహాన్నతమైన వ్యక్తి కేసీఆర్ అని పేర్కోన్నారు. వివిధ సంక్షేమ పథకాలను అందించి ప్రజలను ఆదుకుంటున్న కేసీఆర్, తెలంగాణ రాష్ట్రం వైపు యావత్ భారత దేశం చూస్తుందన్నారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీలలో పడ్తన్పల్లిలో 43 మందిని ఎంపిక చేసి దళిత బంధు పథకం అందించడంతో పాటు రాపల్లి, పడ్తన్పల్లి దళిత కాలనీలను ముంపు కాలనీలలో చేర్చి నష్ట పరిహారం అందించేందుకు ఎమ్మెల్యే దివాకర్ రావు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పడ్తన్పల్లి గ్రామ సర్పంచ్ గొళ్ళ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ వైస్ ఎంపీపీ మందపెల్లి శ్రీనివాస్, దళిత సంఘాల నాయకులు రేగుంట లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
దళిత బంధు యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలి
మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 29 : రాష్ట్ర ప్రభుత్వం దళితులు ఆర్థికాభివృద్ధికి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని, దీన్ని లబ్ధిదారులు సక్రమంగా వినియోగించుకొని లబ్ధిపొందాలని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పొరేషన్) చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో దళితబంధు పథకం కింద ఏర్పాటు చేసుకున్న ఈ-బైక్ షోరూంను సందర్శించి నిర్వాహకుడు గొట్టె కుమార్ను వాహనాల అమ్మకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బుకింగ్, సేల్స్ వివరాల రిజిష్టర్ను చూసి సంతోషం వ్యక్తం చేశారు. వాహనాలను నడిపి సామర్థ్యాన్ని పరీక్షించారు. ఆయన వెంట ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గా ప్రసాద్, సిబ్బంది శైలేందర్, నాయకులు ఉన్నారు. దళిత బంధు పథకం ద్వారా జైపూర్ మండలంలోని ముదిగుంటలో ఏర్పాటు చేసిన సిరామిక్ కంపెనీని పరిశీలించారు. అనంతరం రసూల్పల్లిలోని ఫౌల్ట్రీ ఫాంను, హాజీపూర్ మండలం పడ్తనపల్లిలోని లబ్ధిదారులతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెల్లంపల్లిలోని హార్డ్వేర్ అండ్ శానిటరీ దుకాణం, మందమర్రిలోని షాపులను సందర్శించారు. తాండూరు మండలం బోయపల్లిలోని సీడ్స్ అండ్ ఫర్టిలైజర్, రెడీమేడ్ అండ్ గార్మెంట్స్, కంగన్ హాల్ దుకాణాలను సందర్శించారు. వ్యాపార స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు పలు సూచనలిచ్చారు.
దళితబంధు లబ్దిదారులు ఆర్థిక ప్రగతిని సాధించాలి
మందమర్రి సెప్టెంబర్ 29: దళితబంధు పథకం లబ్ధిదారులు తాము ఎంచుకున్న యూనిట్లను అభివృద్ధి చేసి, పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. మందమర్రి, రామకృష్ణాపూర్ మున్సిపాలిటీలలో దళితబంధు లబ్ధిదారులు ఏర్పాటు చేసిన యూనిట్లను గురువారం ఆయన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్తో కలిసి పరిశీలించారు. మందమర్రి పట్టణంలో పెద్దల ప్రభాకర్ ఏర్పాటు చేసిన మెడికల్ ల్యాబ్, రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గద్దరాగడిలో రేఖ ఏర్పాటు చేసిన కంప్యూటరైజడ్ ఎంబ్రాయిడరీ యూనిట్లను పరిశీలించిన అనంతరం రామగిరి శ్రీనివాస్ అనే లబ్ధిదారుని దళితబంధు పథకం కింద కారును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వర్గాలుగా ఎస్సీలను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వారిని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి లబ్ధి చేకూరుస్తున్నారని అన్నారు. దళిత పక్షపాతి సీఎం కేసీఆర్ అని ఆయన సేవలు దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలకు అందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ జేఏసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చిలుక సంతోష్, ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.