హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న రాష్ట్రాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పట్టభద్రులు పట్టం కట్టారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి విజయం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీపై ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు నిజాన్ని గ్రహించి అభివృద్ధికి పట్టం కట్టారన్నారు. అభివృద్ధిని విస్మరించి, ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్న జాతీయ పార్టీకి రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యం అవుతుందని ప్రజలు మరోసారి గుర్తు చేశారన్నారు.
కీలక సమయంలో సీఎం కేసీఆర్ వెంట ఉన్న రంగారెడ్డి జిల్లా ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో జిల్లా ప్రజల ప్రోత్సాహం, అభిమానం మరవలేనిదని కొనియాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామన్నారు. వాణి దేవి గెలుపు కోసం కృషి చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు మంత్రి అభినందనలు తెలియజేశారు.