టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తొమ్మిదోసారి ఎన్నికైన సీఎం కేసీఆర్ రాజకీయ దురంధరుడని అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూధనాచారి అభినందించారు. కొత్త అధ్యక్షుడిని అభినందిస్తూ సమావేశంలో ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని రాజకీయ శక్తిగా మలచిన రాజనీతి దురంధరుడు, ప్రగతి ప్రదాత అని కొనియాడారు. పార్టీలోని యావత్ కార్యకర్తల పక్షాన అభినందనలు తెలిపారు. రాజకీయ నేతలు తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించడానికి సైతం ధైర్యం చేయని రోజుల్లో కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించి తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపారని చెప్పారు. రాష్ట్ర సాధనకు తగిన వ్యూహాన్ని ఎంచుకోవటంలో కేసీఆర్ చూపిన పరిణతి రాబోయే తరాలకు విలువైన పాఠ్యాంశమని పేర్కొన్నారు. మరో మహాత్మునివలె, అహింసా పథంలో, చెక్కు చెదరని విశ్వాసంతో, మొక్కవోని దీక్షతో పోరాటాన్ని నడిపి లక్ష్యాన్ని సాధించారని ప్రశంసించారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం టీఆర్ఎస్ పార్టీ అజేయంగా నిలిచేలా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.