Koleti Damodar on KCR | భారత దేశ ప్రజల తలరాతను మార్చే గొప్పనిర్ణయం దసరా నాడు రానుండడంతో అన్ని వర్గాలప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్ధ ఛైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు. జాతీయస్ధాయిలో తాము కేసీఆర్ నాయకత్వాన్నికోరుకుంటున్న తరుణంలో పార్టీ ఏర్పాటుకు ముహూర్తం నిర్ణయం కావడంతో ప్రజలు ఆనందోత్సాహలతో దసరా వేడుకలను జరుపుకుంటున్నారని ఒకప్రకటనలో తెలిపారు.
కేసీఆర్తోనే దేశం పురోగమనదిశలో పయనిస్తుందన్న తమ కలలు నిజం కాబోతున్నాయని ప్రజలంతా సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారని కోలేటి దామోదర్ పేర్కొన్నారు. తెలంగాణ లక్ష్య సాధన కోసం డిప్యూటీ స్పీకర్ పదవి సైతం త్యజించి 2001 ఏప్రిల్ ఒకటో తేదీన టీఆర్ఎస్ స్థాపించిన కేసీఆర్ను పట్టువదలని విక్రమార్కుడిగా ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.
తన నిర్దేశిత లక్ష్యం తెలంగాణ సాధించే వరకు విశ్రమించకుండా సొంత రాష్ట్రాన్ని సాధించడంతోపాటు దేశంలోనే మోడల్ రాష్ట్రంగా మార్చడాన్ని ప్రజలు గమనించారని కోలేటి దామోదర్ అన్నారు. దేశంలో బీజేపీకి, ప్రధాని నరేంద్రమోదీకి కేసీఆరే ప్రత్యామ్నాయం అనే భావనలో ప్రజలు ఉన్నారని చెప్పారు.
రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోతుండటంతో బీజేపీ పాలనకు చరమ గీతం పాడే నేతగా కేసీఆర్ నాయకత్వం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు.
సీఎం కేసీఆర్ స్థాపించే జాతీయ పార్టీలో దేశవ్యాప్తంగా పలు పార్టీలు విలీనం కావడానికి సిద్ధం అయ్యాయని కోలేటి దామోదర్ చెప్పారు. దీంతో దేశంలో నూతన రాజకీయ సమీకరణాలకు కేసీఆర్ నాయకత్వం నాంది కాలదని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ మేధస్సును భారత ప్రజలంతా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కనక దుర్గమ్మఆశీస్సులతో సీఎం కేసీఆర్ ఈ నెల 5న గొప్పనిర్ణయాన్ని ప్రకటించనుండటం ఆనందంగా ఉందన్నారు..
అన్ని రంగాలలో దేశాన్ని భ్రష్టు పట్టించి తిరోగమన దిశగా తీసుకువెళ్ళిన పాలకులకు చరమగీతం పాడడం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని అన్ని వర్గాల ప్రజాభిప్రాయమని కోలేటి దామోదర్ వెల్లడించారు. గత ఎనిమిదేండ్లలో తెలంగాణను అభివృద్ధి దిశగా పయనింపజేసిన కేసీఆర్ నాయకత్వంలోనే ప్రపంచ పటంలో దేశం అగ్రభాగంలో ఉండాలన్న ప్రజల కోరిక నెరవేరే సమయం ఆసన్నం కావడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. అన్నదాతలకు రైతు బంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతోపాటు సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే తెలంగాణను నంబర్వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దారన్నారు.