హుజూరాబాద్ టౌన్ : తెలంగాణలోని సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పాటు పడుతున్న ముఖ్య మంత్రి కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీకి నియోజకవర్గ ప్రజలు అండగా ఉండి టీఆర్ఎస్ అభ్యర్థి గెలు శ్రీనివాస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ రాష్ర్ట ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. హుజూరాబాద్ పట్టణం లోని 17, 20, 27వార్డుల్లో స్థానిక కౌన్సిలర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో బండ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ముందుగా శ్రీనివాస్ ను పలువురు నాయకులు శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బండ శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ర్ట సమితికి నియోజకవర్గంలోని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.ఎక్కడికీ వెళ్లిన మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ నిర్లక్ష్యమే ఆయనకు శాపంగా మారిందని అంటున్నారన్నారు.
తమ వాడలో సీసీ రోడ్లు మురుగు కాలువలు కుల సంఘ భవనాలు కమ్యూనిటీ హాలు కావాలని ఎన్నిసార్లు లీడర్లను కలిసి కోరిన పెద్దగా పట్టించుకోలేదని వాపోతున్నారని చెప్పారు. అలాంటిది మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్ వాడవాడల్లో పర్యటించి కావాలని కోరిన వెంటనే ప్రతిదీ మంజూరు చేసి తక్షణమే పనులు జరిగేలా చూస్తుండడంతో ఆనందంగా ఉన్నట్లు ప్రజలు చెబుతున్నారన్నారు. ఓట్ల కోసం మాటల గారడీ చేస్తూ మళ్లీ మభ్య పెట్టాలని చూస్తున్న ఈటల రాజేందర్ కు అదే ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
కుమ్మరి సంఘం నాయకులు ఇంతకుముందే టీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ లేఖ ఇవ్వడం వారి చిత్తశుద్ధికి నిజాయితీకి నిదర్శనం అని బండ గుర్తుచేశారు. 30న జరిగే ఎన్నికల్లో టిఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి గతంలో కన్నా బంపర్ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని శ్రీనివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డుల కౌన్సిలర్లు గణేష్ శెట్టి ఉమామహేశ్వర్, తాళ్లపల్లి శ్రీనివాస్, ఉజ్మనురిన్, నాయకులు తాళ్లపల్లి రజిత, రాపర్తి శివ, కెక్కర్ల సారయ్య, రమణ, కాజీపేట శ్రీనివాస్, రవి, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.