ప్రధాని మోదీ అనాలోచిత, అసమర్థ నిర్ణయాలతో వ్యవసాయం, విద్యుత్తు రంగాలను దివాళా తీయించే యత్నం చేస్తున్నారు. కేంద్రం చర్య వల్ల రైతులతోపాటు నాయీబ్రాహ్మణులు, రజకులు, నేతన్నలు ఇలా ప్రతి రంగానికి ఇస్తున్న సబ్సిడీలకు మంగళం పాడే ప్రమాదం ఉన్నది. గల్లీకో కరెంటు కంపెనీ పెట్టి సబ్సిడీ, ఉచిత విద్యుత్తును ఎత్తివేయాలనుకొనే బీజేపీ ప్రభుత్వ కుటిల బుద్ధిని ప్రజలు అర్థం చేసుకొని ఏకోన్ముఖంగా కేంద్రంపై నిరసన తెలపాలి. – మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు, వ్యవసాయరంగాలను ప్రైవేటీకరించి.. రైతులను తమ సొంత పొలాల్లోనే కూలీలుగా మార్చేందుకు కేంద్రం కక్ష గట్టిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తంచేసిన ఆందోళన నిజమవుతున్నదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ అనాలోచిత, అసమర్థ నిర్ణయాలతో వ్యవసాయం, విద్యుత్తు రంగాలను దివాళా తీయించే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తన కార్పొరేట్ మిత్రుడిని ప్రపంచంలో నంబర్ వన్ స్థానానికి తీసుకొనిపోవడానికి వ్యవసాయం, విద్యుత్తు రంగాలను పణంగా పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యుత్తు సంస్కరణలు తేవడం వల్ల నష్టపోయేది తెలంగాణ రాష్ట్రమేనని పేర్కొన్నారు. సిరిసిల్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం మధ్యాహ్నం 6 వేల మంది జూనియర్ కళాశాల విద్యార్థులకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ ద్వారా ఉచిత ట్యాబ్లను అందజేశారు. అనంతరం కలెక్టరేట్లో ఆడబిడ్డలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం చర్య వల్ల రైతులతోపాటు నాయీబ్రాహ్మణులు, రజకులు, నేతన్నలు ఇలా ప్రతి రంగానికి ఇస్తున్న సబ్సిడీలకు మంగళం పాడే ప్రమాదం ఉన్నదన్నారు.
గల్లీకో కరెంటు కంపెనీ
ప్రజల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ నిల్చున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. మోటర్లకు మీటర్లు పెడితే రూ.25 వేల కోట్ల రుణాలను ఇస్తామని ఆశ పెట్టినప్పటికీ.. సీఎం కేసీఆర్ మాత్రం రైతుల పక్షాన్నే నిలుచున్నారని వెల్లడించారు. గల్లీకో కరెంటు కంపెనీ పెట్టి సబ్సిడీ, ఉచిత విద్యుత్తును ఎత్తివేయాలనుకొనే బీజేపీ ప్రభుత్వ కుటిల బుద్ధిని ప్రజలు అర్థం చేసుకొని ఏకోన్ముఖంగా కేంద్రంపై నిరసన తెలుపాలని పిలుపునిచ్చారు. వ్యవసాయంలో ధాన్యం సేకరణ అంశాన్ని కూడా ప్రైవేటుపరం చేయబోతున్నదని విమర్శించారు. ఆహార భద్రత చట్టం ప్రకారం ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత కేంద్రానిదైతే దాని నుంచి తప్పించుకొంటున్నదని మండిపడ్డారు. తెలంగాణ వడ్లు కొనాలంటే.. భారీగా నిల్వలున్నాయన్న కేంద్రం ఈరోజు ఆహార ధాన్యాల కొరత ఉన్నదని సిగ్గులేకుండా ఎగుమతులపై నిషేధం విధించిందన్నారు. రూ.3 వేలకు టన్ను బొగ్గు దొరికే సింగరేణిని పక్కన పెట్టి.. రూ.35 వేలకు టన్ను బొగ్గును ఆస్ట్రేలియా నుంచి కొంటున్నారని పేర్కొన్నారు. మోదీ కార్పొరేట్ మిత్రులు చేస్తున్న బొగ్గు వ్యాపారంతో విద్యుత్తు సంస్థలకు నష్టం వాటిల్లే కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. పార్లమెంట్లో చర్చించకుండా, ప్రజాభిప్రాయం సేకరించకుండా దొడ్డిదారిన ఎందుకు గెజిట్లు విడుదల చేస్తున్నారని కేంద్రా న్ని ప్రశ్నించారు. ప్రీపెయిడ్ మీటర్లు పెడితే.. ముందుగా డబ్బులు కడితేనే కరెంటు ఇస్తారని.. ప్రైవేటు కంపెనీలు రంగంలోకి దిగితే.. పెట్రో ధరల మాదిరిగానే విద్యుతు చార్జీలు అడ్డగోలుగా పెరుగుతాయని చెప్పారు. నల్ల చట్టాల మాదిరి విద్యుత్తు చట్టాలను బలవంతంగా ప్రజలపై మోదీ రుద్దుతున్నారని తెలిపారు. తన కార్పొరేట్ మిత్రులకు రూ.లక్షల కోట్లు మాఫీ చేసి.. రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా అడ్డుకొంటున్నారన్నారు.
ఫస్ట్ ర్యాంకు సాధిస్తా: రుచిత
‘మాలాంటి పూర్ ఫ్యామిలీకి ట్యాబ్ కొనుగోలు చేసే శక్తి లేదు సార్. పేదింటి పిల్లలకు ఇవ్వాలన్న మీ నిర్ణయం మాలో సంతోషాన్నిచ్చింది. మీరిచ్చిన ప్రో త్సాహంతో ఫస్ట్ ర్యాంకు సాధిస్తా. మీకు రుణపడి ఉంట.’ అన్న విద్యార్థిని రుచితను మంత్రి కేటీఆర్ అభినందించారు. తన చేతుల మీదుగా ట్యాబ్ అం దుకొన్న రుచిత అన్న మాటలకు స్పందించిన మం త్రి కేటీఆర్ ఆమెను దగ్గరకు తీసుకొని ఆశీర్వదించారు. చందుర్తి మండలం ఎనగంటికి చెందిన రుచి త సిరిసిల్ల మండలం చిన్నబోనాల సాంఘిక సంక్షే మ వసతి గృహంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది. ఆమెతో కేటీఆర్ కొద్దిసేపు మాట్లాడారు.
మంచి చేసి పోటీ చేయండి
వచ్చే ఎన్నికల్లో తనతో పోటీ చేయాలనుకునే వాళ్లు వృథా ఖర్చులు పెట్టకుండా గుండెకు హత్తుకునేలా మంచి పనులు చేసి, ప్రజల మనుసును గెలువాలని ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ సూ చించారు. తాను నాలుగు ఎన్నికల్లో పోటీ చేసినా ఒక్క చుక్క మద్యం, డబ్బులు ఓటర్లకు ఇవ్వలేదని స్పష్టం చేశారు. విద్యార్థులకు, పేదలకు సేవా కార్యక్రమాలు చేయడం వల్ల తాను అదే నిజమైన పుట్టిన రోజుగా భావిస్తానన్నారు.