కరీంనగర్: గత ప్రభుత్వాలు ముదిరాజులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, మత్స్యకారులకు వెయ్యికోట్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం దేశాయిపల్లి పీఎస్ కే ఫంక్షన్ హాల్ లో బుధవారం జరిగిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంలో అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్తో కలసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ముదిరాజుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తీరు మనకు తెలుసని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎన్ని నీళ్లు వచ్చాయో చూస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ మత్స్యకారుల కోసం మోటార్ సైకిల్లు ఇస్తే, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచిందని ఆరోపించారు. రూ. 150 కోట్లతో లగేజ్ ఆటోలు, రూ. 65 కోట్లతో హైదరాబాద్, జిల్లా కేంద్రాలకు మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వెహికిల్స్ ఇచ్చామని, రాబోయే రోజుల్లో అన్ని మండలాలకు మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వెహికిల్స్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రూ. 75 కోట్లతో మత్స్యకార భవనాలు మంజూరు చేశామని తెలిపారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి చేప పిల్లల డబ్బులు మత్స్యకార సంఘాలకు ఇచ్చేలా చూస్తామన్నారు. రేపటి నుంచి అన్ని చెరువులు, కుంటల్లో చేప పిల్లలు వేసే కార్యక్రమం చేపడుతామని హరీశ్రావు స్పష్టం చేశారు. రైతు బీమా తరహాలో మత్స్యకారులకు కూడా రూ. 6 లక్షల భీమా పాలసీ తీసుకొస్తామని, త్వరలోనే 609 జీవో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెరువులు, కుంటలపై మత్స్యకారులకే హక్కు కల్పించేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.
బీజేపీకి ఓటు వేస్తే లాభం జరుగుతుందా.. టీఆర్ఎస్ కి ఓటు వేస్తే లాభం జరుగుతుందా అని ప్రజలు ఆలోచించాల న్నారు. త్వరలోనే స్థానికంగా అధునాతన చేపల మార్కెట్ ఏర్పాటు చేస్తామని, రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ త్వరలోనే పెన్షన్ ఇస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వీణవంకలో 24/7 ఆస్పత్రిని వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నర్సింగపూర్ కు బ్రిడ్జి.. వీణవంకలో సెంట్రల్ లైటింగ్ ను త్వరలోనే మంజూరు చేస్తామన్నారు.
దొడ్డు వడ్లు కొనమని కేంద్రం చెబుతోందని, వీణవంకలో ఓట్లు అడిగే ముందు బిజెపి నాయకులు దొడ్డు వడ్లు కొంటామని కేంద్రంతో చెప్పించాలని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ కోసం కొట్లాడితే 130 కేసులు నమోదై జైళ్ల పాలయ్యాడన్నారు. అందుకే గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం ఉందని, మీ తలలో నాలుకలా ఉండే వ్యక్తి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని హరీశ్రావు కోరారు.
పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ ఈటెల రాజేందర్ చీడ పురుగు అని ప్రజలను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. ఈ సందర్భంగా వీణవంకకు 24/7 ఆస్పత్రి, జమ్మికుంట వరకు రోడ్డు మంజూరు చేయించినందుకు మంత్రి హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఉమ్మడి జిల్లా ఫిషరీస్ సొసైటీ మాజీ చైర్మన్ పొలు లక్ష్మణ్ ముదిరాజు, భారీ సంఖ్యలో ముదిరాజులు హాజరయ్యారు.