హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హక్కుల కోసం టీఆర్ఎస్ పోరాడుతుంటే ఎక్కడికి పోయారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు. రాహుల్ పర్యటన సందర్భంగా ట్విట్టర్లో.. ‘రాహుల్గాంధీ జీ.. మీరు కానీ, మీ పార్టీ కానీ ఎన్ని సార్లు పార్లమెంట్లో తెలంగాణ అంశాలను, హక్కులను ప్రస్తావించారో చెప్పండి. రాష్ట్ర హక్కుల కోసం టీఆర్ఎస్ పోరాడుతుంటే మీరెక్కడున్నారు? దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టీఆర్ఎస్ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడికి పోయారు? తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా, తెలంగాణ రాష్ర్టానికి హక్కుగా రావాల్సిన పెండింగ్ జీఎస్టీ బకాయిలు, నిధుల గురించి టీఆర్ఎస్ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యాసంస్థలు ఇవ్వకుండా మొండిచేయి చూపిస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు?’ అని కవిత నిలదీశారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, ఆసరా పథకాలపై ఆరాతీసి, అవి తెలంగాణ ముఖచిత్రాన్ని ఎలా మార్చాయో, దేశానికి సమగ్ర అభివృద్ధి మార్గాన్ని ఎలా చూపించాయో.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకోవాలని హితవు చెప్పారు. ‘సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను 11 రాష్ర్టాలు అమలు చేస్తున్నాయి. వాటి గురించి నేర్చుకొని, అర్థం చేసుకొనేందుకు మీకు తెలంగాణలోకి స్వాగతం చెప్తున్నాం’ అని పేర్కొన్నారు.