‘మా సినిమాకు ప్రేక్షకులు వందకు వంద మార్కులు వేశారు. మూడేళ్లు మేము పడిన కష్టాన్ని మర్చిపోయే విజయాన్ని అందించారు’ అన్నారు నిఖిల్. ఆయన హీరోగా నటించిన సినిమా ‘కార్తికేయ 2’ శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. చందూ మొండేటి దర్శకుడు. శనివారం నిర్వహించిన సక్సెస్మీట్లో హీరో నిఖిల్ మాట్లాడుతూ…‘మా సినిమా విడుదలైన ప్రతి చోట నుంచీ సూపర్ హిట్ టాక్ వచ్చింది. దేశంలోనే కాదు యూఎస్ నుంచి కూడా వస్తున్న స్పందన మాకెంతో సంతోషాన్నిస్తున్నది’ అన్నారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ…‘వసూళ్ల వివరాలు త్వరలో వెల్లడిస్తాం. సినిమా బాగుందనే టాక్ అందరి దగ్గర నుంచీ వస్తున్నది’ అన్నారు. దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ…‘మూడేళ్లు పాండమిక్ను తట్టుకుని ఈ సినిమాను రూపొందించాం. ఇవాళ మా సినిమాకు దక్కిన విజయం మేము పడిన కష్టాలన్నీ మర్చిపోయేలా చేసింది’ అన్నారు.