నిఖిల్ హీరోగా నటించిన సినిమా ‘కార్తికేయ 2’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. చందూ మొండేటి దర్శకుడు. ఇవాళ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్నది. గురువారం ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ..‘కార్తికేయ’ సినిమా చూశాను. బాగుంది. సీక్వెల్గా వస్తున్న ఈ సినిమా కూడా విజయం సాధించాలి. వరుస విజయాలు అందుకుంటూ చిత్ర పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందాలి’ అన్నారు. దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ..‘విగ్రహాలకు పాలాభిషేకం వంటి వాటిని కొందరు విమర్శిస్తారు. కానీ పురాణాల్లో, ఇతిహాసాల్లో చెప్పిన ప్రతి విషయానికీ ఒక శాస్త్రీయ కారణం ఉంటుంది.
ఇలాంటి ఎన్నో విషయాలను ఈ సినిమాలో చర్చించాం’ అని అన్నారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ…‘మంచి చిత్రాలకు తప్పక ఆదరణ లభిస్తుందని ఇటీవల రెండు హిట్ చిత్రాలు నిరూపించాయి. మా సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రీ బుకింగ్స్ బాగా అవుతున్నాయి. టీమ్ అంతా మైనస్ డిగ్రీలోనూ షూటింగ్ చేసి చిత్రీకరించాం. బలమైన కథ, కథనాలతో పాటు సాంకేతికంగా ఉన్నతంగా ఉండే చిత్రమిది’ అన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత విజయేంద్రప్రసాద్, సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు పాల్గొన్నారు.