బెంగళూరు: బీజేపీ పాలిత కర్ణాటకలో గ్రామస్తులు నరకయాతన పడుతున్నారు. ప్రతి ఏటా వర్షా కాలం వచ్చిందంటే తెగ ఇబ్బంది పడుతున్నారు. చనిపోయిన బంధువుల మృతదేహాలను నడుంపైగా నీటిలో మునిగి తరలించాల్సి వస్తున్నది. ఆ రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర సొంత నియోజకవర్గం పరిధిలోని గ్రామంలో ఈ దుస్థితి నెలకొన్నది. శివమొగ్గ జిల్లా కోడ్లు గ్రామంలో శ్మశానికి వెళ్లే రోడ్డు వర్షాలు వచ్చినప్పుడల్లా మునిగిపోతుంది. దీంతో మరణించిన వారికి అంత్యక్రియల కోసం గ్రామస్తులు నానా ఇబ్బంది పడుతున్నారు. నడుం లోతు నీటిలో నడుస్తూ శవాలను మోసుకెళ్లాల్సి వస్తున్నది. ఈ సమస్యను పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఫలితంగా మళ్లీ ఆ తిప్పలు పడాల్సి వస్తున్నది.
వర్షా కాలం నేపథ్యంలో కర్ణాటకలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లోని గ్రామాలు నీట మునిగాయి. శివమొగ్గ జిల్లా కోడ్లు గ్రామం కూడా వరద నీటితో నిండిపోయింది. దీంతో చనిపోయిన బంధువుల అంత్యక్రియలకు గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయ్యాయి.