హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): కడుపు నింపి, ఆర్థికంగా బలం చేకూర్చేందుకు ఎవరైతే వెంట నిలుస్తారో వారికి మద్దతుగా నిలవడమే ధర్మం అని కర్ణాటకలోని బ్రహ్మశ్రీ నారాయణగురు శక్తిపీఠం పీఠాధిపతి, ఆర్య ఈడిగ రాష్ట్రీయ మహా మండలి జాతీయ అధ్యక్షుడు ప్రణవానంద స్వామి అన్నారు. తెలంగాణలో గౌడ కులస్థుల ఆత్మగౌరవాన్ని పెంచేలా, ఆర్థికంగా వారు అభ్యున్నతి పొందేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని తెలిపారు. అలాంటి ప్రభుత్వానికి మద్దతుగా ఉండటం కనీస బాధ్యత అని, ఆ ధర్మానికి తెలంగాణ గౌడ సోదరులు కట్టుబడి ఉండాలని సూచించారు. ఈడిగ సమస్యలపై పోరాటంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, స్థానిక గౌడ కులసంఘాల మద్దతు కోరేందుకు హైదరాబాద్కు వచ్చిన ప్రణవానంద స్వామి ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
కర్ణాటకలో ఉన్నతవర్గాల కోసమే అక్కడి ప్రభుత్వం పనిచేస్తున్నది. బడుగు, బలహీన వర్గాలను మరింత అణచివేసే ధోరణితో ముందుకెళ్తున్నది. ఈడిగల కులవృత్తి అయిన కల్లుగీతపై 18 ఏండ్లుగా నిషేధం కొనసాగుతున్నది. నిషేధాన్ని ఎత్తేయాలని రెండేండ్లుగా పోరాడుతున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి గౌడ సామాజికవర్గానికి ఎంతో గౌరవం ఇచ్చి, వారి ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకొంటున్నది. గౌడ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం గౌడల పట్ల సీఎం కేసీఆర్కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తున్నది. అందుకే నా పోరాటంలో వారి మద్దతు కోరేందుకు వచ్చాను. గౌడ కుల సంఘ నాయకులను మా ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరాను.
ఇటీవలే టీవీలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ను చూశాను. రెండేండ్లుగా కర్ణాటకలో ఈడిగలు చేస్తున్న పోరాటం గురించి ఆయన వివరించిన తీరు ఆశ్చర్యపర్చింది. కర్ణాటక ప్రభుత్వం మా ఆందోళనను కనీసం పట్టించుకోలేదు. కానీ, తెలంగాణ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆ సమస్యలను ప్రస్తావించడం ఆయనకు ఉన్న అపార అవగాహనకు నిదర్శనం. తెలంగాణలో గౌడలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం, చేస్తున్న మేలును చూసి సీఎం కేసీఆర్ను కలిసేందుకు వచ్చాను. కర్ణాటకలో ఈడిగ డిమాండ్ల సాధన కోసం వచ్చే ఏడాది జనవరి 6న మంగళూరు నుంచి బెంగళూరు వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించాను.
తెలంగాణలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఏ ఇతర రాష్ట్రంలోనూ అమలుచేయటం లేదు. ఇంత గొప్ప పనులు మరెక్కాడా నేను చూడలేదు. కర్ణాటకలో కల్లుగీతను నిషేధించటమే కాదు… వృత్తిదారులకు పెన్షన్లు అన్నమాటే లేదు. బీజేపీ సర్కార్ మా సామాజిక వర్గాన్ని మొత్తం నాశనం చేసింది.. మాకు తీరని ద్రోహం చేసింది.
దేశంలో వివిధ రాష్ర్టాల్లో వివిధ పేర్లతో ఉన్నా.. మొత్తం 20 శాతం వరకు గౌడ సామాజికవర్గం ప్రజలు ఉంటారు. నేను దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉంటాను. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న మంచి పనులపై దేశవ్యాప్తంగా గౌడలకు తెలియజేస్తాను. తెలంగాణ తరహా విధానాలే కర్ణాటకలోనూ అమలుచేయాలన్నదే మా కోరిక.
నేను మరో మూడు రోజులపాటు తెలంగాణలోనే ఉంటా. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా. మునుగోడులో అత్యధిక సంఖ్యలో గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. నేను వారందరినీ జాగృతం చేయడానికి అక్కడికి వెళ్తా. అయితే ఇది ఏ పార్టీ తరఫున ప్రచారం మాత్రం కాదు.. కేవలం గౌడ కులానికి మంచి చేస్తున్న, గౌడ సామాజిక ఆత్మగౌరవాన్ని పెంచేందుకు పాటుపడుతున్న వారి వెంట నిలవాలని వారికి విజ్ఞప్తి చేస్తా.
దేశవ్యాప్తంగా తెలంగాణ అభివృద్ధి మాడల్ రావాలని నేను వందకు వందశాతం కోరుతున్నాను. కేసీఆర్పై భగవాన్ నారాయణ్ గురూజీ, సర్దార్ పాపన్నగౌడ్ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. రాజకీయాంగా వారు మరింత ఎదగాలని ఆశీర్వదిస్తున్నాను. బీఆర్ఎస్ను వందకు వందశాతం ఆహ్వానిస్తున్నాను. కర్ణాటకలోనూ బీఆర్ఎస్ పోటీ చేయాలని కోరుకొంటున్నాను.