Karnataka Alert | దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్పై ఆందోళన నేపథ్యంలో కర్ణాటక సర్కార్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నది. వివిధ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో స్క్రీనింగ్ టెస్ట్లు తప్పనిసరి చేసింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. విదేశీ ప్రయాణికులకు వారం తప్పనిసరి క్వారంటైన్ నిబంధనలు అమలులోకి తెచ్చింది. ఈ మేరకు శనివారం సీఎం బస్వరాజ్ బొమ్మై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
దక్షిణాఫ్రికాతోపాటు బోట్స్వానా, హాంకాంగ్, ఇజ్రాయెల్ తదితర దేశాల నుంచి వచ్చిన వారి వద్ద కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ ఉన్నా మళ్లీ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొంది. క్వారంటైన్ సమయం ముగిసిన తర్వాత మళ్లీ నెగెటివ్ వచ్చిన తర్వాత బయటకు వెళ్లాలని స్పష్టం చేసింది.
ఇక ధార్వాడ్ ఎస్డీఎం మెడికల్ కళాశాలలో 281 మంది కోవిడ్ బారీన పడటంతో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే సందర్శకులపైన ఆంక్షలు విధించింది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని ఆదేశించింది.
మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, మాల్స్, హోటల్స్, సినిమా హాళ్లు, జూ, స్విమ్మింగ్పూల్స్ తదితర చోట్ల ప్రవేశాలకు రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి చేసింది. స్కూళ్లు, కళాశాలల్లో తాత్కాలికంగా సాంస్కృతిక వేడుకలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నది.