బెంగళూరు: ఒక యువకుడు ‘అరుంధతి’ సినిమా తరహాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గిడ్డయ్యనపాళ్య గ్రామానికి చెందిన 23 ఏళ్ల రేణుకా ప్రసాద్ పదో తరగతి టాపర్. దీంతో అతడ్ని బాగా చదివించాలని తల్లిదండ్రులు భావించారు. ఇంటర్ విద్య కోసం తుమకూరుకు పంపారు. అయితే సినిమాలకు బానిస అయిన ప్రసాద్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ తర్వాత చదువు మానేశాడు. తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా అతడు వినిపించుకోలేదు. జులాయిగా ఊర్లు తిరిగాడు.
కాగా, ప్రసాద్ ఇటీవల తెలుగు హర్రర్ సినిమా ‘అరుంధతి’ సినిమాను 15 నుంచి 20 సార్లు చూశాడు. అందులో నిప్పటించుకున్న సీన్ను తాను చేస్తానంటూ రెండు రోజులుగా ఇంట్లో అంటున్నాడు. దీని గురించి తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రసాద్ బుధవారం 20 లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేశాడు. ఆ సాయంత్రం గ్రామ శివారుకు వెళ్లాడు. కొంత పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పటించుకున్నాడు.
మంటల్లో కాలిపోతున్న ప్రసాద్ను గమనించిన స్థానికులు మంటలు ఆర్పి తొలుత స్థానిక ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 60 శాతం కాలిన గాయాలైన అతడు చికిత్స పొందుతూ గురువారం మరణించాడు.
మరోవైపు ఆత్మహత్యకు ముందు తండ్రి సిద్ధప్ప నుద్దేశించి ప్రసాద్ ఒక వీడియో కూడా రికార్డు చేశాడు. తన ఆత్మార్పణతో వారికి మోక్షం లభిస్తుందని అందులో పేర్కొన్నాడు. కాగా, కొడిగెనహళ్లి పోలీసులు ప్రసాద్ ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నారు. పెట్రోల్ బంక్ నుంచి 20 లీటర్ల పెట్రోల్ను అతడు ఎలా కొనుగోలు చేశాడో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.