బెంగళూరు: మీరంతా సత్య హరిశ్చంద్రులని అనుకుంటున్నారా? ఇది మీకు నా ఓపెన్ చాలెంజ్. మొత్తం 225 మంది ఎమ్మెల్యేలు విచారణకు అంగీకరించండి. ఎవరికి అక్రమ సంబంధాలు ఉన్నాయో, ఎవరు ఏకపత్నీవ్రతులో చూద్దాం.. ఇదీ కర్ణాటక ఆరోగ్య మంత్రి సుధాకర్ రాష్ట్ర అసెంబ్లీలోని మిగతా ఎమ్మెల్యేలకు విసిరిన సవాలు. మీడియా తమపై అభ్యంతరకర ప్రసారాలు చేయకుండా కోర్టు నుంచి ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొచ్చిన ఆరుగురు మంత్రుల రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇందులో సుధాకర్ కూడా ఒకరు. మంత్రి రమేష్ జర్కిహోలి సెక్స్ ఫర్ జాబ్ సీడీ కేసు విషయంలో కర్ణాటక అసెంబ్లీ అట్టుడుకుతోంది. రమేష్తోపాటు దీనికి సంబంధం ఉన్న మిగతా ఐదుగురు మంత్రులూ రాజీనామా చేయాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
మీరేమైనా ఏకపత్నీవ్రతులా?
దీంతో బుధవారం మీడియాతో మాట్లాడిన సుధాకర్.. ఈ వింత సవాలు విసరడం వివాదాస్పదమైంది. ఆయన వ్యాఖ్యలపై బీజేపీతోపాటు ఇతర ఎమ్మెల్యేలు, స్పీకర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో సుధాకర్ వివరణ ఇచ్చారు. ఆరుగురు మంత్రుల ప్రతిష్టను దిగజార్చాలని కాంగ్రెస్ చూసినప్పుడు ఎవరూ ఏమీ అనలేదు. నా ప్రకటన మాత్రం కొందరిని బాధించింది. నా ప్రకటనను మరోలా తీసుకోకుండా నా మాటల్లోని బాధను, ఆగ్రహాన్ని అర్థం చేసుకోండి అని సుధాకర్ అన్నారు. ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, మాజీ సీఎం కుమారస్వామి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ స్పీకర్ రమేష్లను ఉద్దేశించి సుధాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. వాళ్లంతా సత్య హరిశ్చంద్రులు, ఏకపత్నీవ్రతులు అంతేగా అంటూ సుధాకర్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన సిద్ధరామయ్య.. ఇది ఎమ్మెల్యేల సభాహక్కుల ఉల్లంఘనే అవుతుందని అన్నారు. అటు శివకుమార్ స్పందిస్తూ.. తనకు కేవలం ఒక భార్య మాత్రమే ఉన్నదని చెప్పడం విశేషం.