బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అకాల మరణాన్ని అభిమానులు, శ్రేయోభిలాషులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన చేసిన మంచి పనులను తలుచుకోవడంతోపాటు ఆయన స్మృతి పది కాలలపాటు నిలిచి ఉండేలా కొందరు ప్రయత్నిస్తున్నారు. కర్ణాటక అటవీశాఖ అధికారులు ఈ దిశగా ముందడుగు వేశారు. శివమొగ్గ సమీపంలోని సక్రెబైలు ఏనుగు శిబిరంలోని రెండున్నర ఏండ్ల ఏనుగు పిల్లకు పునీత్ రాజ్కుమార్ అని పేరు పెట్టారు.
కాగా, ఈ గున్న ఏనుగుకు పునీత్ రాజ్కుమార్ పేరు పెట్టడం వెనుక కారణాన్ని శివమొగ్గ వన్యప్రాణి డివిజన్కు చెందిన డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నాగరాజ్ వివరించారు. పునీత్ రాజ్కుమార్ చివరిసారిగా సెప్టెంబర్లో ఈ శిబిరాన్ని సందర్శించారని, రెండు గంటలకు పైగా ఇక్కడ ఉన్నారని చెప్పారు. ఏనుగు సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంటరీ షూటింగ్లో భాగంగా ఈ గున్న ఏనుగుతో పునీత్ కొంత సమయం గడిపారని అన్నారు. ఈ నేపథ్యంలో శిబిరం సిబ్బంది, స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు మగ ఏనుగు పిల్లకు దివంగత నటుడు పునీత్ పేరు పెట్టినట్లు ఆయన వెల్లడించారు.