బొమ్మై: సీఎం లోకల్ టీ తాగరు!
12-10-2022
కర్ణాటకలోని విజయనగర జిల్లా హోస్పేటలో బుధవారం దళితుడు హీరాల కల్లరప్ప ఇంట్లో అల్పాహారం తింటున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై. ఈ ఇంట్లో బ్రాండెడ్ టీ తెప్పించాలని అధికారులు ఇంటి యజమానిని ఆదేశించడం వివాదాస్పదమైంది.
బెంగళూరు, అక్టోబర్ 13, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలో దళితుల ఇంటికి అల్పాహారం తినడానికి వెళ్లిన ఆ రాష్ట్ర సీఎం, మాజీ సీఎం.. వారిని గొంతెమ్మ కోర్కెలు కోరటం వివాదాస్పదమైంది. జనసంకల్ప యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి బొమ్మె, మాజీ సీఎం యడ్యూరప్ప బుధవారం హోస్పేటలో దళితుల ఇంట్లో ఉపాహారం సేవించారు. ఈ సందర్భంగా పోలీసులు, అధికారులు.. ‘సీఎం లోకల్ బ్రాండ్ టీ తాగరు. బ్రూక్బాండ్, కణ్ణన్దేవన్ వంటి బ్రాండ్ల టీ పౌడర్ తెప్పించండి’ అని ఆ దళిత కుటుంబాన్ని ఆదేశించారు. అల్పాహారంగా దళితులు సిద్ధం చేసిన ఉప్మా, ఉగ్గాణి, మిరపకాయ బజ్జీలను అణువణువూ తనిఖీ చేశారు. ఈ హంగామా ఆ దళిత కుటుంబానికి చిరాకు తెప్పించింది. దీనిపై దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు.
‘అంత అనుమానం ఉంటే వాళ్లింటికి వీళ్లు ఎందుకు పోవాల?’ అని దళిత సంఘర్ష సమితి రాష్ట్ర అధ్యక్షుడు మావళ్లి శంకర్ ప్రశ్నించారు. ‘అసలే పేదలు, కూలీ, నాలీ చేసుకుని బతికే వాళ్లు. పెట్టింది తినకుండా ఎకువ ధర సరుకుల్ని తెమ్మంటే ఎలా తెస్తారు?’అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయ నేతల నాటకాలకు దళితులు బలి కారాదని పిలుపునిచ్చారు. ఎవరైనా తమ నివాసాలకు వస్తామంటే రావొద్దని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పాలని దళితులకు సూచించారు. తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో గత రెండు నెలలుగా రాష్ర్టానికి వరుస కట్టిన కేంద్ర మంత్రులు తమ పార్టీ దళిత కార్యకర్తల ఇండ్లలో భోజనం తింటామని చెప్పి బయటి నుంచి తెప్పించుకున్న ఆహారమే తిన్నారు.
అమిత్ షా: బయటినుంచే బ్లాక్టీ
21-8-2022
సికింద్రాబాద్లోని సాంబమూర్తినగర్లో బీజేపీ దళిత కార్యకర్త సత్యనారాయణ ఇంట్లో బయటినుంచి తెచ్చిన బ్లాక్ టీ తాగుతున్న కేంద్ర మంత్రి అమిత్షా. మినరల్వాటర్, టిఫిన్లు బయటివే!
నిర్మల: హాట్ బాక్స్లో ఇడ్లీ, ఉప్మా
3-09-2022
దళిత కార్యకర్త ఇంట్లో అల్పాహారం తింటానని వచ్చి బయటినుంచి హాట్బాక్స్లో ఇడ్లీ, ఉప్మా తెప్పించుకొని పింగాణీ ప్లేట్లో తింటున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం, కొడిచర్ల గ్రామంలో భీమయ్య ఇంట్లో మంత్రి చేసిన హంగామా ఇది.
ప్రహ్లాద్: హోటల్ నుంచే సాపాటు
23-9-2022
హైదరాబాదల్ శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్నగర్ డివిజన్ కృష్ణవేణినగర్లో బీజేపీ దళిత్ మోర్చా డివిజన్ అధ్యక్షుడు నర్సింగ్ ఇంట్లో హోటల్ నుంచి తెప్పించుకున్న టిఫిన్ తింటున్న కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి.