Basavaraj Bommai | ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్నాటక ముఖ్యమంత్రి బసరాజ్ బొమ్మై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని, ఇది ఇలాగే కొనసాగితే మాత్రం మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన శుక్రవారం ప్రకటించారు. మరోవైపు ఆక్సిజన్ సిలిండర్లు, మందులు, బెడ్లు ఇలా అవసరమైన మౌలిక సదుపాయాలను మరింత పెంచుతున్నామని కూడా పేర్కొన్నారు. కోవిడ్ కేసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో కర్నాటక కూడా ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొనే, మున్ముందు కఠిన నిర్ణయాలు కూడా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ‘దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. 8 రాష్ట్రాల్లో కేసుల ప్రభావం పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ఓ జాబితాను విడుదల చేసింది. ఇందులో కర్నాటక కూడా ఉంది. ఇప్పటికే తాము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. పరిస్థితి ఇబ్బంది కరంగానే ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే, రాబోయే రోజుల్లో మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం’ అని సీఎం బొమ్మై స్పష్టం చేశారు.