కర్ణాటకలో ఏం జరుగుతోంది? ఏప్రిల్ 17 తర్వాత ఏం జరగబోతోంది? కర్ణాటక సీఎం యడ్యూరప్పకు మరోసారి పదవీగండం తప్పదా. సొంత పార్టీ నేతలే ఆయనపై తిరుగుబాటు చేసేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇలాంటి సందేహాలు ఎన్నింటినో తీసుకొస్తున్నాయి. బెళగావి జిల్లాలో బుధవారం మీడియాతో మాట్లాడిన బసవనగౌడ యడ్యూరప్ప పదవిపై బాంబు పేల్చారు. మే 2 తర్వాత ఏ క్షణంలో అయినా యడ్యూరప్ప సీఎం పదవి నుంచి దిగిపోకతప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏప్రిల్ 17 తర్వాత ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని బసవనగౌడ యత్నాల్ తెలిపారు.
‘సూర్యచంద్రులు ఉన్నంత కాలం యడ్యూరప్పనే సీఎంగా కొనసాగుతారని కొంతమంది అంటున్నారు. అసలు అది ఎలా సాధ్యం. 2023 తర్వాత కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారా 75 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ ఆయనకు వర్తించదా’ అని యత్నాల్ ప్రశ్నించారు. ఇప్పటికే యడ్యూరప్ప రెండేళ్లు అదనంగా సీఎం పదవిలో కొనసాగడం ఆయన అదృష్టంగా భావించాలన్నారు. ఇందుకు పార్టీ హైకమాండ్కు, పార్టీ నేతలకు, కార్యకర్తలకు కృతజ్ఞతగా ఏప్రిల్ 17 తర్వాత స్వచ్ఛందంగా రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే మే 2 తర్వాత ముఖ్యమంత్రి పీఠంలో కచ్చితంగా మార్పు తప్పదని ఆయన పేర్కొన్నారు. గతంలో కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి యడ్యూరప్పను పలుమార్లు తొలగించారని గుర్తుచేశారు. ఉత్తర కర్ణాటక నుంచి కొత్త ముఖ్యమంత్రి ఎన్నికయ్యే అవకాశం ఉందని కూడా ఆయన అన్నారు.
యడ్యూరప్పపై వచ్చిన అవినీతి ఆరోపణలపై హైకమాండ్ ఇప్పటికే గుర్రుగా ఉంది. అలాగే మంత్రివర్గంలో తమకు చోటు దక్కకపోవడంతో పలువురు నేతలు కూడా ఆయనపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెళగావి లోక్ సభ నియోజకవర్గంలోని మస్కి, బసవకళ్యాణం అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 17న ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తన కుమారుడు విజయేంద్రను బసవకళ్యాణ నుంచి పోటీ చేయించాలని యడ్యూరప్ప భావించాడు. అందుకోసం అభివృద్ధి పనులు చేయడంతో పాటు అనేక సార్లు నియోజకవర్గంలో పర్యటించారు. కానీ యడ్డీపై ఉన్న అసంతృప్తి కారణంగా విజయేంద్రకు హైకమాండ్ సీటు నిరాకరించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో యడ్డీపై యత్నాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
స్వతంత్ర విచారణ జరగాల్సిందే.. సుప్రీంకోర్టులోనూ అనిల్ దేశ్ముఖ్కు షాక్
‘అనిల్ దేశ్ముఖ్ బాటలో మరో ఇద్దరు మంత్రులు’
బీజేపీ నేతపై పోలీస్ కాల్పులు.. తన హత్యకు కుట్ర జరిగినట్లు ఆరోపణ
జైలు నుంచి లేఖ రాయడం కొత్త వ్యూహమే : సంజయ్ రౌత్
ఎన్నికల ప్రచారాల్లో మాస్కులు తప్పనిసరి.. కేంద్రానికి హైకోర్టు నోటీసులు