‘తెలంగాణ నన్న హేసరన్న రైత రాజు నిజమాడితు. నీవు బందు నమ్మ జీవనవన్ను బదలాయి స బేకు’ రైతే రాజు అన్న నానుడిని తెలంగాణ సర్కారు నిజం చేసింది. మీరు రావాలి. మా జీవితాలను మార్చాలి. –కర్ణాటక స్థానిక సర్పంచ్ మనసులోని మాట ఇది.
‘కేసీఆర్ ఆలే తరాచ్ దేశ్ సుధారేలా.. బీహారామధీలా, సైనికా అణి మజురాంచా జ్యా పద్ధతీనే విచార్ కేలా జాతో తో మహాన్ ఆహే.. ఆమ్ జన్తాకో.. కిసానోంకో తెలంగాణమే అచ్ఛే స్కీం చల్ రహాహై.. హమారే యహా ఐసే తరహ్ కోయీ స్కీం నహీహై..’
కేసీఆర్ వస్తేనే దేశం బాగుపడుతుంది. బీహార్ కూలీలు, సైనికుల గురించి ఆయన ఆలోచన చేసిన విధానం చాలా గొప్పది. సామాన్య ప్రజలకు, రైతులకు తెలంగాణ రాష్ట్రంలో మంచి పథకాలు అమలు అవుతున్నాయి. మా రాష్ట్రంలో ఇలాంటి ఒక్క పథకం కూడా లేదు.
– మహారాష్ట్ర ప్రజల హృదయ స్పందన ఇది.
దీపం ఎక్కడున్నా ఆ వెలుగు దశదిశలా వ్యాపిస్తుంది. ఉన్నత వ్యక్తుల ధర్మ కార్యాచరణ కూడా ఇదే రీతిలో నలుచెరగులా వెలుగొందుతుంది అనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ఇతర రాష్ర్టాల ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న గౌరవాభిమానాలే నిదర్శనం. జాతీయ స్థాయిలో అరాచక పాలన సాగుతున్న నేపథ్యంలో, ఇతర రాష్ర్టాల వారికి తెలంగాణ ఆశాదీపంలా కనిపిస్తున్నది. కేంద్ర విధానాల మూలంగా దేశవ్యాప్తంగా వ్యవసాయం సంక్షోభమయమైపోతే, తెలంగాణలో మాత్రం సంక్షేమ పాలన సాగుతున్న తీరును వివిధ రాష్ర్టాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి అడుగు పెడుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ పాత్రికేయ బృందం మన రాష్ట్ర పొలిమేరలు దాటి చుట్టూరా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు వెళ్లి అక్కడి ప్రజాప్రతినిధులు ప్రజలు, మేధావుల అభిప్రాయాలను సేకరించింది. అన్ని ప్రాంతాల్లోనూ.. అన్ని వర్గాలవారిదీ ఒక్కటే మాట.. కేసీఆర్ నాయకత్వం దేశానికి కావాలి. ఆయన వస్తేనే దేశం బాగుపడుతుంది.. వీరందరి అభిప్రాయాలతో నమస్తే తెలంగాణ రేపట్నుంచి ధారావాహికంగా కథనాలు ప్రచురిస్తున్నది.