పంపిణీ ఎక్కడ: చౌకధరల దుకాణాలు,వయోపరిమితి : 18 ఏళ్లు
సమర్పించాల్సిన పత్రాలు :రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఎస్సెస్సీ మెమో, ఓటర్ ఐడీలో ఏదో ఒక జిరాక్స్. అర్హులైన మహిళలు అందుబాటులో లేకుంటే తల్లి గానీ, తండ్రి గానీ వెళ్లి తెచ్చుకోవచ్చు.
జరీ తళుకులు,నూలు సొబగులు, 24 విభిన్న డిజైన్లు, 10 రకాల ఆకర్షణీయమైన రంగులు.. 240 వెరైటీలు6 గజాలు, 9 గజాలు,మీటరు జాకెట్ పీస్..
ఇలా నవ్యత, నాణ్యతతో ఆడబిడ్డలు మెచ్చేలా,మనసు మురిసేలా, కార్మికక్షేత్రం సిరిసిల్లతోపాటు గర్శకుర్తి నేతన్నల చేతిలో రూపుదిద్దుకున్న బతుకమ్మ చీరెలను, నేటి నుంచి అందించేందుకు అంతా సిద్ధమైంది! మహిళల అతిపెద్ద పండుగ బతుకమ్మకు ఐదేళ్ల నుంచి సారె పెడుతున్న రాష్ట్ర సర్కారు, ముచ్చటగా ఆరోసారి అందిస్తున్నది! కులమతాలకతీతంగా 18 ఏళ్లు నిండిన వారందరికీ ఇవ్వనున్నది! నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పంపిణీ చేయనుండగా, చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అందజేయనున్నారు. ఈ రెండు మూడు రోజుల్లో మిగతా నియోజకవర్గాల్లో అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్ల్లు చేశారు.
ఆడబిడ్డలకు అతిపెద్ద పండుగ బతుకమ్మ.. తొమ్మిది రోజులపాటు సంబురంగా జరుపుకునే వేడుక.. ఈ సద్దుల పండుగకు ఐదేళ్ల నుంచి సారె పెడుతున్న రాష్ట్ర సర్కారు, ఆరోసారి అందించేందుకు అంతా సిద్ధం చేసింది.. కార్మికక్షేత్రం సిరిసిల్లతోపాటు గర్శకుర్తిలో నూరు వర్ణాలు, పది డిజైన్లలో రూపుదిద్దుకున్న బతుకమ్మ చీరలను, కులమతాలకతీతంగా 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నేటి నుంచే పంపిణీ చేయనున్నది..
ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా చీరలు అందించడంతోపాటు నేతన్నకు ఉపాధి చూపి ఆదుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టింది. 2017 నుంచి ఏటా 18 ఏండ్లు నిండిన బీపీఎల్ మహిళలందరికీ ఉచితంగా అందిస్తున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమలు, జౌళీ శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో చీరల తయారీ బాధ్యతను ప్రధానంగా సిరిసిల్లలోని నేత కార్మికులకే అప్పగిస్తున్నది. ఈ ఏడాది 339.70 కోట్లు కేటాయించి కోటి చీరల ఉత్పత్తికి ఆర్డర్ ఇచ్చింది. నేతన్నలకు నెలకు 15వేల నుంచి 20వేలు సంపాదించే విధంగా చేయూత నిచ్చింది. ఈ నెల 25 నుంచి బతుకమ్మ ఉత్సవాలు మొదలు కానుండగా, 7నెలల్లోనే కోటీ చీరల ఉత్పత్తి పూర్తయింది. టెస్కో సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ వరకే అన్ని జిల్లాలకు చీరలను చేర్చింది. కోటీ చీరల తయారీతో 20 వేల మరమగ్గాలపై సుమారు 30వేల మంది కార్మికులకు చేతినిండా పని దొరికింది.
ఆడబిడ్డలు మెచ్చేలా..
ఎప్పట్లాగే ఈ సారి ఆడబిడ్డలు మెచ్చేలా కార్మికక్షేత్రం సిరిసిల్లతోపాటు గర్శకుర్తిలో చీరలను తయారు చేయించారు. ముందుగానే గ్రామాల నుంచి వచ్చిన మహిళా ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకొని గతంలో కంటే అందంగా ఉండేలా చూశారు. నిఫ్ట్ డిజైనర్ల సహకారం తీసుకొని అత్యుత్తమ ప్రమాణాలతో ఉత్పత్తి చేశారు. పది రకాల ఆకర్షణీయమైన రంగులు, 24 విభిన్న డిజైన్లలో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్ (దారపు పోగుల అంచులు)తో చీరలను తీర్చిదిద్దారు. వందశాతం పాలిస్టర్ ఫిలిమెంట్ నూలుతో తయారు చేశారు. ఆరు మీటర్లు, తొమ్మిది మీటర్ల పొడువున్న చీరలను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఇప్పటికే జిల్లాలకు సరఫరా చేయగా, నేటి నుంచే పంపిణీ చేయనున్నారు. ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం సిరిసిల్లలో పంపిణీ చేయనుండగా, ఈ రెండు మూడు రోజుల్లో మిగతా జిల్లాల్లో అందించనున్నారు.
– కరీంనగర్, సెప్టెంబర్ 21 (నమస్తేతెలంగాణ)
వీటిని తీసుకెళ్లండి..
ఆహార భద్రత కార్డులపై నమోదైన పుట్టిన తేదీని బట్టి వచ్చే అక్టోబర్ 1 వరకు 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళ చీర, జాకెట్ అందుకునేందుకు అర్హులని ప్రకటించారు. ఆధార్ కార్డు, ఎస్సెస్సీ మెమో, ఓటరు గుర్తింపు కార్డులో ఏదో ఒకదాని జిరాక్స్ను స్థానిక చౌక ధరల దుకాణంలో సమర్పించి చీర, జాకెట్ తెచ్చుకోవచ్చు. అర్హులైన మహిళలు అందుబాటులో లేకుంటే తల్లిగాని, తండ్రిగానీ వెళ్లి తెచ్చుకోవచ్చు.
చొప్పదండిలో నేడే పంపిణీ
ఈ యేడాది జిల్లాలో 2.41 లక్షల చీరలు అందించనున్నారు. నేడు చొప్పదండిలో పంపిణీ చేయనుండగా, మిగతా నియోజకవర్గాల్లో రెండు రోజుల్లో అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సిరిసిల్ల నుంచి కరీంనగర్, హుజూరాబాద్ డివిజన్ కేంద్రాలకు చీరలు ఇటీవలే చేరుకోగా, అక్కడి నుంచి మండలాల వారీగా నోడల్ అధికారులు చౌక ధరల దుకాణాలకు అవసరమైనన్ని సరఫరా చేస్తున్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, డీఆర్డీవో ఎల్ శ్రీలతా రెడ్డి పర్యవేక్షణలో గ్రామాల వారీగా సెక్రటరీలు, గ్రామ మహిళా సమైక్యల ప్రతినిధులు, రేషన్ డీలర్ల సమక్షంలో పంపిణీ చేస్తారు. పట్టణాల్లో అయితే వార్డు బిల్ కలెక్టర్, మహిళా సంఘాల ప్రతినిధులు, డీలర్ల సమక్షంలో అందిస్తారు. పాలిస్టర్ ఫిలివెంట్ నూలు చీరెలను తమ శాఖ రూపొందించిందని చేనేత, జౌళీ శాఖ ఏడీ సంపత్ తెలిపారు.