గంగాధర, సెప్టెంబర్ 21: చొప్పదండి నియోజకవర్గంలోని ఆఖరి ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. బుధవారం మండలంలోని బూరుగుపల్లిలో నియోజకవర్గంలోని నీటిపారుదల ప్రాజెక్టులు, పెండింగ్ పనులపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలోని సాగునీటి కాలువల పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ను కోరినట్లు తెలిపారు.
పెండింగ్లో ఉన్న డీ1,డీ2 కాలువ నిర్మాణ పనులు, కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ భూసేకరణ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటీల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేయాలని, ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. నారాయణపూర్, మంగపేట, చెర్లపల్లి గ్రామాల ముంపు గ్రామాల సమస్యలను గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఈలు అశోక్కుమార్, ఈఈ సుధాకిరణ్, శ్రీనివాసరావు గుప్త, డీఈలు తిరుపతి, రూప్ల, రాంప్రదీప్, అరుణ్కుమార్, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.