కరీంనగర్ : యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మంత్రి గంగుల సమక్షంలో కరీంనగర్ జడ్పీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. తీర్మానానికి సంబంధించిన కాపీని ప్రధాని నరేంద్ర మోదీకి పంపనున్నట్లు జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ తెలిపారు. సమావేశంలో మంత్రి గంగుల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రైతుల పక్షాన మరో పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
1965లో ఏర్పడిన ఎఫ్సీఐ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి రాష్ట్రంలో పండిన పంటలు కొనుగోలు చేస్తున్నదన్నారు. ఇప్పుడు తెలంగాణ రైతులు పండించిన పంటను ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. ‘మేం బిచ్చగాళ్లమా?.. తెలంగాణ కూడా ఈ దేశంలోనే ఉంది మా హక్కుల కోసం, తెలంగాణ రైతుల సంక్షేమం కోసం మరో పోరాటం చేస్తాం’ అని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.