ఆ దంపతులిద్దరూ రెండున్నర ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు కూతుళ్లను ఏ లోటూ లేకుండా పెంచుతున్నారు. ఒకరిని కాలేజీ, మరొకరిని స్కూలుకు పంపించి పొలానికి మందు కొట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో పొలం లోపలికి దిగిన భర్తకు విద్యుత్ తీగలు తగిలి షాక్తో గిలగిలా కొట్టుకుంటుండగా కాపాడబోయిన భార్యనూ ఆ కరెంట్ కాటేసింది. మరుక్షణంలో దంపతులిద్దరూ విలవిలలాడుతూ కుప్పకూలారు. తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో అనాథలైన చిన్నారులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. చొప్పదండి మండలం వెదురుగట్ట పరిధిలో ప్రమాదం జరుగగా, మృతుల స్వగ్రామమైన ఎలిగేడు మండలం సుల్తాన్పూర్లో విషాదాన్ని నింపింది.
– చొప్పదండి, అక్టోబర్ 18
చొప్పదండి/ఎలిగేడు, అక్టోబర్ 18: పొలంలోకి వెళ్లిన భర్త విద్యుత్ తీగలు తగిలి షాక్తో మృతిచెందగా, అతడిని కాపాడబోయిన భార్య కూడా అదే విద్యుత్ షాక్తో ప్రాణాలొదిలింది. తల్లిదండ్రులిద్దరూ మృతిచెందడంతో అనాథలైన అమ్మాయిలు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. ఈ ఘటన చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలో జరుగగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామంలో విషాదాన్ని నింపింది.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన జాతరకొండ ఓదెలు(40)కు చొప్పదండి మండలం వెదురుగట్ట రెవెన్యూ గ్రామంలో రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు కృష్ణవేణి ఇంటర్ సెకండియర్, చిన్న కూతురు సంజన 8వ తరగతి చదువుతున్నారు.
ఎప్పటిలాగే పొలానికి మందుకొట్టేందుకు ఓదెలు, భార్య రజిత(36), మరో వ్యక్తి జాతరగొండ శేఖర్తో కలిసి మంగళవారం వెళ్లాడు. ముందుగా ఓదెలు పొలంలో దిగి మందు కొడుతుండగా అక్కడ తెగిపడి ఉన్న విద్యుత్ వైరు కాలికి తగలడంతో షాక్తో గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఆ సమయంలో కొద్దిదూరంలో ఉన్న రజిత, శేఖర్ అది చూసి ఓదెలును కాపాడేందుకు వెళ్లారు. ముందుగా రజిత తన భర్తను కాపాడే ప్రయత్నంలో ఓదెలును పట్టుకోగా ఇద్దరికీ షాక్ వచ్చి అక్కడికక్కడే మృతి చెందారు.
ఇది గమనించిన శేఖర్ అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ వెళ్లి కుటుంబసభ్యులు, గ్రామస్తులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి సోదరుడు జాతరగొండ బుచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఉపేంద్రాచారి తెలిపారు. ఓదెలు పొలంమీదుగా వెళ్తున్న ఎల్టీలైన్ 3 పేస్ విద్యుత్ వైర్ తెగి పడిపోవడంతోనే తన తమ్ముడు, మరదలు మృతిచెందారని బుచ్చయ్య ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్ఐ తెలిపారు.
అనాథలైన చిన్నారులు
తల్లిదండ్రులిద్దరూ ఒకే రోజు మృతిచెందడంతో ఆ ఇద్దరు అమ్మాయిలు అనాథలయ్యారు. తమను పొద్దున్నే కాలేజీ, స్కూల్కు పంపి పొలానికి వెళ్లిన తల్లిదండ్రులు సాయంత్రం వచ్చేసరికి కరెంట్ షాక్తో నిర్జీవులై పడి ఉండడం చూసి ఆ చిన్నారులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాలపై పడి గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడున్న వారిని కన్నీరు పెట్టించింది.