మహనీయుల స్మరణ
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన మంగళవారం ఉత్సాహంగా సాగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అమాత్యుడు నాటి ఉద్యమకారుల పోరాటాలను స్మరించుకున్నారు. తెలంగాణ వైతాళికుల పేర్లు స్వరాష్ట్రంలో యూనివర్సిటీలు, కొత్త జిల్లాలకు పెట్టుకున్నామని, వారి విగ్రహాలను అధికారికంగా ఆవిష్కరించుకుంటున్నామని స్పష్టం చేశారు. సిరిసిల్ల పర్యటన సందర్భంగా మధ్యాహ్నం 12.30 గంటలకు పట్టణానికి చేరుకున్న మంత్రి కేటీఆర్ మొదట రేణుక ఎల్లమ్మ జంక్షన్లో కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద రూ.కోటితో ఆధునీకరించిన కబ్రస్థాన్, రూ.18 లక్షలతో కొనుగోలు చేసిన ఆఖరీ సఫర్ వాహనాన్ని ప్రారంభించారు. రూ.2 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం ఆధునీకరణ, రూ.2.29 కోట్లతో చేపట్టనున్న వెంకంపేట మెయిన్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. సిరిసిల్ల అర్బన్ మండలం రాజీవ్నగర్లో రూ.13 లక్షలతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు చోట్ల పలువురి సమస్యలు వింటూ కొన్ని అక్కడే పరిష్కరించడంతో పాటు మరికొన్నింటికి హామీ ఇచ్చారు. పిల్లలతో సరదా సంభాషణలు చేస్తూ నవ్వులు పూయించారు.
చేయాల్సింది ఇంకా ఉన్నది..
సిరిసిల్ల ప్రాంత ప్రజలు అవకాశం ఇవ్వడం వల్లే నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నా. మీ ఆశీస్సుల వల్లే ప్రభుత్వం నిలబడింది. మీ రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రాంత సమస్యలను అవగతం చేసుకుని ఓ బిడ్డగా నా ప్రయత్నం చేస్తున్నా. టెక్స్టైల్ పార్క్ బాగు చేయడంతోపాటు కొత్తగా అప్పారెల్ పార్క్, వీవింగ్ పార్క్, వర్కర్టూ ఓనర్ పథకాలు, ఎస్సారార్లో ఆక్వాహబ్, గంభీరావుపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, వేములవాడలో ఇథనాల్ పార్క్, విద్యాలయాలు, వ్యవసాయ కళాశాల, నర్సింగ్ కళాశాల, జేఎన్టీయూ, మెడికల్ కళాశాలలను తెచ్చుకున్నాం. జిల్లాలో జరిగిన అభివృద్ధి చాలదు. ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది. దశలవారీగా మరింత అభివృద్ధి చేస్తాం.
– మంత్రి కేటీఆర్
సిరిసిల్ల ట్రెండ్ మారింది
సిరిసిల్లలో అప్పట్లో ఒక ట్రెండ్ ఆనవాయితీగా వచ్చేది. ఇక్కడ ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉంటే అధికారంలో వేరే పార్టీ ప్రభుత్వం ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆ ట్రెండ్ మారింది. ఇక్కడ నన్ను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రితోపాటు ప్రభుత్వం కూడా ఏర్పడింది. ట్రెండ్ మారడంతోపాటు సిరిసిల్ల రూపురేఖలు మార్చాం. సిరిసిల్ల మానేరు వాగులో తంగళ్లపల్లి వంతెన కింద నీళ్లు చూస్తే మనస్సు సంతోషంతో నిండిపోయింది. జిల్లెల్లకు రాగానే వ్యవసాయ కళాశాలను చూస్తే సంతోషం అనిపిస్తున్నది. కడుపు నిండా అన్నం తిన్నట్టు అనిపిస్తున్నది. సిరిసిల్లలో నర్సింగ్ కళాశాల, డబుల్ బెడ్రూం ఇండ్లు, చక్కటి రహదారులు చూస్తూ చాలా మంది సోదరులు సిరిసిల్ల ఇప్పడు చాలా మారిపోయిందని గుర్తు చేస్తున్నారు. సిరిసిల్ల నేతన్నలు కొంచెం గాడిన పడ్డారు. అయినా ఇంకా చేయాల్సి ఉన్నది. తమిళనాడులోని తిరుపూరు కావాలంటే ఇక్కడి కార్మికులే నడుం బిగించాలి. కంకణబద్ధులై ముందుకు సాగాల్సి ఉన్నది.
– మంత్రి కేటీఆర్
నేటి తరానికి కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు తెలియాలి. విగ్రహాలు ఏర్పాటు చేయడంతోపాటు ఆయన గొప్పతనాన్ని స్మరించుకోవాలి. మంత్రి పదవిని త్యాగం చేసి తొలి దశ తెలంగాణ పోరాటానికి ఊపిరిలూదారు. అప్పటి ప్రభుత్వం నిర్బంధకాండను ధిక్కరించారు. ఇందిరాగాంధీతో నేరుగా మాట్లాడగలిగిన అతి తక్కువ మందిలో బాపూజీ ఒకరు. 2001లో రెండో దశ ప్రత్యేక పోరాటానికి కేసీఆర్ నేతృత్వం వహిస్తున్నారని తెలుసుకుని, పార్టీ ఆఫీసు కోసం తనఇంటిని ఇచ్చిన త్యాగధనుడు. తొలి జెండా ఎగురవేయగానే సంబురపడ్డారు. బాపూజీ కడుపులో కేసీఆర్ తలపెట్టి ముందుకు సాగారు. అప్పటి సీఎం చంద్రబాబు ఆయనపై కక్షగట్టారు. జలదృశ్యంలోని బాపూజీ వస్తువులను రోడ్డుపై పడేయించారు. తర్వాత సుప్రీంకోర్టులో కేసు గెలిచి సగర్వంగా జెండా ఎగురవేశాం. ఈరోజు అదే జలదృశ్యంలో నిలువెత్తు బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఆనందాన్నిచ్చింది. కండ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈరోజు నిజంగా కొండ లక్ష్మణ్ బాపూజీ ఆత్మ శాంతించింది. బ్రహ్మాండంగా హార్టికల్చర్ యూనివర్సిటీకి బాపూజీ పేరు పెట్టుకున్నాం.
– రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
నేతన్నలకు కేసీఆర్ అండ..
నేత కార్మికులను ఆది నుంచీ ఆదుకున్నది సీఎం కేసీఆరే. ఉద్యమ సమయంలో నేతన్నల ఆత్మహత్యలను చూసి చలించిపోయారు. రూ.50 లక్షలు నేతన్నల సంక్షేమ నిధికి అందించారు. ఇప్పటికీ ఆ ట్రస్టు ద్వారా సేవలు అందుతున్నాయి. ప్రభుత్వం నేత కార్మికుల అభివృద్ధికి, టెక్స్టైల్, అప్పారల్ పార్క్, వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లు ఏర్పాటు చేసింది. స్థానిక పద్మశాలీ నేతలు ఆధునికత వైపు అడుగులు వేయాలి. పోటీ ప్రపంచానికి అనుగుణంగా మార్పులకు శ్రీకారం చుట్టాలి. యువతను చేనేత రంగం వైపు ప్రోత్సహించాలి.
– నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు
పద్మశాలీల ఆత్మగౌరవం పెంచింది
జలదృశ్యం, సిరిసిల్లలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాల ఏర్పాటు పద్మశాలీల ఆత్మగౌరవం పెంచింది. ఈరోజు రెండు పండుగలు జరుపుకున్నంత సంతోషంగా ఉన్నది. హైదరాబాద్లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటును అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి అడ్డుకున్నారు. నేతన్నల గుండెచప్పుడు తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ నేడు అదే ప్రాంతంలో 20 అడుగుల ఎత్తయిన బాపూజీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషదాయకం-టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్
కేసీఆర్, కేటీఆర్కు కృతజ్ఞతలు
మహనీయుడు కొండ లక్ష్మణ్బాపూజీ విగ్రహ ఏర్పాటు కార్యక్రమం మున్సిపల్ ఆధ్వర్యంలో జరుపుకోవడం గర్వంగా ఉన్నది. విగ్రహం ఏర్పాటుతో సిరిసిల్ల నేత కార్మికుల ఆత్మగౌరవం ఇనుముడించింది. విగ్రహ ప్రదాతలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు.
– సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ
సీఎం చెప్పినట్టే కడుపులో పెట్టి చూసుకుంటున్నాం..
2004లో సీఎం కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు కోరుట్ల నుంచి సిరిసిల్ల మీదుగా హైదరాబాద్ వెళ్తుండగా ‘గోడలపై నేతన్న ఆత్మహత్యలు వద్దు’ అని రాసిన రాతలు చూసి కళ్లల్లో నీళ్లు తెచ్చుకున్నారు. అప్పుడు చలించి రూ.50 లక్షల నిధిని పద్మశాలీ సంఘం నేతలకు అప్పగించి, ట్రస్టు స్థాపించి పద్మశాలీలకు భరోసా కల్పించారు. అప్పుడే తెలంగాణ వచ్చినంక కడుపులో పెట్టుకుని చూసుకుంటానని కేసీఆర్ చెప్పారు. ఆయన చెప్పినట్టే నేతన్నలను ఇప్పుడు కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారు. 70 కోట్ల బడ్జెట్ను 1200 కోట్లు చేశాం. బతుకమ్మ చీరెలు, యూనిఫాంలతోపాటు ఇతర ఆర్డర్లు ఇచ్చి ఉపాధి కల్పించాం. ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయాలు చూసుకుందాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే బాసులు. ఎవరికి అవకాశమిస్తే వారే అధికారంలో ఉంటారు. అభివృద్ధిలో పోటీ పడదాం. కులమతాలకతీతంగా పేద వాడి ముఖంలో చిరునవ్వు చూసే ప్రభుత్వం ఉండాలన్నదే ఆకాంక్ష.
– మంత్రి కేటీఆర్
స్వరాష్ట్రంలోనేమహనీయులకుగుర్తింపు
తెలంగాణ పోరాట యోధులు, స్వాతంత్య్ర సమరయోధులను గౌరవించుకున్న మహనీయుడు సీఎం కేసీఆర్. బాపూజీ రాష్ట్ర సాధన, స్వాతంత్య్ర పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకం. అంతటి మహనీయుడి చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా జలదృశ్యంతోపాటు సిరిసిల్లలోనూ విగ్రహాలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ
రాత్రీపగలు తేడా లేదు..అన్నా అంటే ఆగిపోవడమే.
సిరిసిల్ల పర్యటన ముగించుకుని హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో తంగళ్లపల్లి వద్ద మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని చూసిన ఓ యువతి ‘రామన్నా..’ అనిపిలుస్తూ వచ్చింది. వెంటనే మంత్రి తన వాహనాన్ని ఆపి,
యువతి తేజస్వితో మాట్లాడారు. వారి సమస్య అడిగి తెలుసుకున్నారు. తమ భూమి విషయంలో కొందరు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలుపడంతో అక్కడే ఉన్న ఏఎస్పీ చంద్రయ్యను పిలిచి, వారి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.దీంతో తేజస్వి ఆమె తండ్రి గుడ్ల వెంకన్న మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.