తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు, సీఎం కేసీఆర్ వెన్నంటి ఉండి స్వరాష్ట్ర సాధన కోసం తన సర్వస్వాన్ని అర్పించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి తెలంగాణ సర్కారు అరుదైన గౌరవం కల్పించింది. మంత్రి కేటీఆర్ చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు బ్రిడ్జి, ఎల్లమ్మ జంక్షన్ వద్ద రూ.50 లక్షలతో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. మంగళవారం బాపూజీ జయంతి సందర్భంగా అమాత్యుడి చేతుల మీదుగా ఆవిష్కృతంకాబోతుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాట యో ధు డు. తెలంగాణ విముక్తి పోరాటానికి నాయకత్వం వహించారు. 1915 సెప్టెంబర్ 27న కుమ్రం భీం జిల్లా వాంకిడి గ్రామంలోని చేనేత కుటుంబంలో జన్మించిన పద్మశాలీ ముద్దుబిడ్డ. చిన్నతనంలోనే తల్లి మరణించింది. తన బాల్యమంతా కష్టాలతో కూడుకున్నా ఆయన చదువుకు మాత్రం స్వస్తి చెప్పలేదు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు పుట్టిన గడ్డపైనే చదువుకున్న ఆయన న్యాయశాస్త్ర విద్యకోసం పట్నం బాట పట్టారు. 1940లో న్యాయవాద వృత్తిని స్వీకరించారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, మరాఠీ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు.
‘ క్విట్ ఇండియా’లో కీలక పాత్ర..
కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. 17 ఏండ్ల ప్రాయంలోనే పోరుబాట పట్టారు. 1938లో పోలీసులు అరెస్ట్ చేశారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సంద ర్భంగా హైదరాబాద్ నడిబొడ్డున ఇప్పటి (అబిడ్స్సెంటర్)లో జాతీయ జెండాను ఎగరేసిన ధీరుడు. ఆయనకు భార్య డాక్టర్ శకుంతలాదేవి, కుమార్తె, కొడుకు ఉన్నారు.
1947లో దేశానికి స్వాతం త్య్రం వచ్చినా తెలంగాణ మాత్రం నిజాం నవాబు పాలనలో ఉండి పోయింది. నిజాం నిరంకుశ పాలనను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన తెలంగాణ విముక్తి పోరాటానికి నాయకత్వం వహించారు. గాంధేయ మార్గంలో అహింసా పద్ధతిలో పోరాటం చేశారు. 1947 డిసెంబర్ 4న నిజాం మీద జరిగిన బాంబు దాడికి బాపూజీ నాయకత్వం వహించారు. నేతన్న కుటుంబంలో పుట్టిన ఆయన 1943లోనే చేనేత సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు.
1950లో హైదరాబాద్ రాష్ట్ర కో ఆపరేటివ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, 1959లో గీత కార్మిక సహకార సంఘం, 1960లో మత్స్య కార్మిక సహకార సంఘం, 1961లో చర్మ సహకార సంఘం ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించి, సహకార రత్న బిరుదును దక్కించుకున్నారు. బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డగా ఖ్యాతి గడించారు. 1952లో అసిఫాబాద్ నుంచి, 1956లో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1960లో దామోదర సంజీవయ్యను ముఖ్యమంత్రిని చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మంత్రివర్గంలో అబ్కారి, చేనేత జౌళీ, చిన్న తరహ పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
తెలంగాణ కోసం రాష్ట్రంలో పాదయాత్రల పర్వానికి శ్రీకారం చుట్టింది ఆయననే అని చెబుతుంటారు. 1960లో తెలంగాణ ఉద్య మం కోసం పదవి త్యాగం చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమం హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ పక్కన జలదృశ్యం కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలోనే టీఆర్ఎస్ పురుడు పోసుకున్న విషయం తెలిసిందే. తన సంపాదనలో 76 శాతం సమాజ శ్రేయస్సు కోసం దానం చేసిన వ్యక్తి బాపూజీ. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని 2012లో కన్నుమూశారు.
కేటీఆర్ చొరవతో కాంస్య విగ్రహం
పద్మశాలీయుల ముద్దుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాడి నిలిచిన కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. కార్మిక క్షేత్రం. నేతన్న గడ్డపై బాపూజీ విగ్రహం ఏర్పాటు కోసం ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు బ్రిడ్జి, ఎల్లమ్మ జంక్షన్ వద్ద రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహం నేడు అ మాత్యుడి చేతుల మీదుగా ఆవిష్కృతంకాబోతున్నది.
నేతన్నల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, బాపూజీ విగ్రహాన్ని సిరిసిల్లలో ఏర్పాటు చేయడంపై నేతన్నల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. తెలంగాణ పవర్లూం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సిరిసిల్లకు చెందిన గూడూరి ప్రవీణ్కు ఇచ్చిన విషయం తెలిసిందే. సిరిసిల్ల పద్మశాలీ సంఘానికి 5 ఎకరాల స్థలం కూ డా ఇచ్చారు. నేతన్నలకు చేతినిండా పనికల్పించేందుకు రూ.3వేల కోట్ల వస్త్ర ఆర్డర్లు కేటీఆర్ ఇప్పించి బతుకులకు భరోసా కల్పించారు. ఆచార్య కొండా లక్ష్మణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తమకు పెద్దన్నయ్యాడంటూ కొనియాడుతున్నారు. బతికినంత కాలం ఆయన్ను గుర్తుపెట్టుకుంటామన్నారు.
నేడు సిరిసిల్లకు మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 26 (నమస్తే తెలం గాణ) : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు పట్టణంలోని మానేరు బ్రిడ్జి ఎల్లమ్మ జంక్షన్ వద్ద 50 లక్షలతో ఏర్పాటు చేసిన అచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడే బైపాస్ రోడ్డులో పబ్లిక్ మీటింగ్కు హాజరై ప్రసంగి స్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు 2.29 కోట్లతో చేపట్టనున్న వెంకంపేట మెయిన్ రోడ్డు, 2 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళా శాల మైదానం అభివృద్ధి పనులకు శంకుస్థా పన చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అంబేద్కర్ చౌరస్తా పక్కన కోటితో ఆధునీకరించిన కబ్రస్థాన్ను ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 3 గంటలకు 18 లక్షలతో కొనుగోలు చేసిన ఆఖరి సఫర్ వాహనాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 4గంటలకు రాజీవ్నగర్లో బస్తీ దవాఖాన, 4.30 గంటలకు తంగళ్లపల్లి మం డలం నేరెళ్లలో మోడల్ అంగన్వాడీ కేంద్రం, 5 గంటలకు తంగ ళ్లపల్లిలో ఎంపీపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.