స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి.. ఉమ్మడి జిల్లాలో కనుల పండువగా సాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించగా, విద్యార్థులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు వీక్షించారు. ఈ నెల 15న ఇంటింటా జెండా ఎగురవేయడంలో భాగంగా పతాకాలను పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంత్రి గంగుల కమలాకర్ ఇంటింటికీ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, స్వయంగా పలువురి ఇండ్లకు వెళ్లి అందజేశారు. అధికారులు కూడా ఆయాచోట్ల పంపిణీ చేశారు. నేడు పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మొక్కలు నాటి, ఫ్రీడం పార్కులు ఏర్పాటు చేయనున్నారు.
కరీంనగర్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): భారత స్వతంత్ర వజ్రోత్సవాలు రెండో రోజూ జిల్లాలో అంబరాన్నంటాయి. ఊరూరా పండుగలా సాగుతున్నాయి. ఈ నెల 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునివ్వగా, ఈ మేరకు మంగళవారం ఇంటింటికీ జాతీయ జెండాలు పంపిణీ చేశారు. కలెక్టరేట్లోని ఆడిటోరియంలో వజ్రోత్సవాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం గర్వపడేలా వజ్రోత్సవాలను నిర్వహించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను కోరారు.
భారత కీర్తి దశ దిశలా వ్యాపించేలా నిర్వహించాలని స్పష్టం చేశారు. సమావేశం తర్వాత నగరంలోని భగత్నగర్లో మంత్రి గంగుల స్వయంగా వెళ్లి ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, మేయర్ వై సునీల్రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్లాల్, గరిమా అగర్వాల్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపా రాణి పాల్గొన్నారు.
హుజూరాబాద్, జమ్మికుం ట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీలు, జిల్లాలోని 18 మండలాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇంటింటికీ వెళ్లి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. జిల్లాలోని 3,08,754 గృహాలకు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరధిలోని 79,953 గృహాలకు జెండాల పంపిణీ లక్ష్యంగాప పెట్టుకున్న అధికారులు ఒక్క రోజులోనే సుమారు 2 లక్షల జెండాలను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. జాతీయ జెండాను గౌరవించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జిల్లా ప్రజలను కోరారు. ఎగుర వేసే సమయంలో నిబంధనలు పాటించాలని, జెండాకు నష్టం కలుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు.
ఉచితంగా గాంధీ చిత్రం ప్రదర్శన..
వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు, ప్రజల్లో దేశభక్తి స్పురించేలా జిల్లాలోని అన్ని థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించారు. కాగా, నగరంలోని ప్రతిమా మల్టీప్లెక్స్లో ప్రదర్శించిన చిత్రాన్ని విద్యార్థులతో కలిసి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కాసేపు వీక్షించారు. కాగా, చొప్పదండిలోని శ్రీనివాస్ థియేటర్లో జరిగిన చిత్ర ప్రదర్శనను అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ వీక్షించారు.