కలెక్టరేట్, జులై 2: సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ అధికారులతో సమావేశమై, మాట్లాడారు. మున్సిపాలిటీల పరిధిలో రోడ్లు, ఫుట్పాత్లను ఆనుకొని ప్రమాదకరంగా ఉన్న మ్యాన్హోల్స్ను గుర్తించి, ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.
పారిశుధ్యం సక్రమంగా ఉంటేనే సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని సూచించారు. మున్సిపాలిటీల పరిధిలోని అన్ని వార్డుల్లో ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో డ్రై డే నిర్వహించాలన్నారు. మురుగునీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో ఆయిల్బాల్స్ వేయించాలని, సరిపడా ఫాగింగ్ మిషన్లు కొనుగోలు చేసి స్ప్రే చేయించాలన్నారు. డ్రై డే కార్యక్రమం బాధ్యత వార్డు అధికారులదేనని, మున్సిపల్ కమిషనర్లు ప్రతి శుక్రవారం క్షేత్రస్థాయిలో పాల్గొనాలన్నారు. నివేదికను మంగళ, శుక్రవారం సాయంత్రం తనకు పంపాలని ఆదేశించారు.
ఎస్టీపీ పురోగతిపై ఆరా
మున్సిపల్ పరిధిలో రూ.60కోట్లకు పైగా నిధులతో నిర్మిస్తున్న సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) పనుల పురోగతిపై కలెక్టర్ ఆరా తీశారు. పనులు వేగవంతం చేసేలా అధికారులు దృష్టిసారించాలన్నారు. 13లక్షలతో రాజీవ్నగర్లో నిర్మిస్తున్న బస్తీ దవాఖాన పనులు పూర్తి చేసి, 15 రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
వెంకటాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కులో మున్సిపాలిటీకి కేటాయించిన సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. వేములవాడలో 4.50 కోట్లతో సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్, భగవంతరావునగర్లో 2.70 కోట్లతో వెజ్ మార్కెట్, తెట్టెకుంటలో 1.30కోట్లతో నిర్మిస్తున్న డంప్యార్డు పనుల పురోగతిపై ఆరా తీశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని శాంతినగర్, రగుడు, పెద్దూరులోని డబుల్బెడ్రూం కాలనీలలో నీటి సరఫరా పైపులైన్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. పట్టణాల్లో రోడ్లకు ఇరువైపులా మల్టీలేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.
వెంకటాపూర్ నుంచి రగుడు వరకు నిర్మిస్తున్న రహదారి వెంబడి మొక్కలు నాటేందుకు మిషన్ల సాయంతో గుంతలు తీయాలని ఆదేశించారు. అలాగే భవన నిర్మాణ అనుమతుల కోసం టీఎస్ బీపాస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి మంజూరు చేయాలన్నారు. వేములవాడ బఫర్జోన్లో ఉన్న భవనాలకు నోటీసులు జారీ చేయాలని, కొత్తగా నిర్మాణాలు జరుగకుండా చూడాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో కమిషనర్లు సమ్మయ్య, శ్యామ్సుందర్రావు, డీటీసీపీవో అన్సార్, పబ్లిక్ హెల్త్ డీఈ ప్రసాద్, సంబంధిత ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.