అధికారులకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశం
చింతకుంట, ఎలగందల్లో పర్యటన
కొత్తపల్లి, మే 25: గ్రామీణ కేంద్ర క్రీడాప్రాంగణాల కోసం అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడలకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎకరంలో ఆటస్థలం ఏర్పాటుకు ఆదేశించిన తరుణంలో బుధవారం కొత్తపల్లి మండలం చింతకుంట, ఎలగందల్ గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. గ్రామీణ క్రీడా ప్రాంగణాల కోసం చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు.
ఖోఖో, కబడ్డీ మొదలైన ఆటలకు అనుకూలంగా ఉండేలా క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేయాలని సూచించారు. స్థల సేకరణలో సమస్యలు తలెత్తకుండా ముందుగానే చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎలగందల్ గ్రామంలోని బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ప్రకృతి వనంలో ఎండిపోయిన మొకల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, కొత్తపల్లి తహసీల్దార్ శ్రీనివాస్, చింతకుంట, ఎలగందల్ సర్పంచులు మొగిలి మంజుల, ఏ షర్మిల తదితరులు పాల్గొన్నారు.