హంస వాహనంలో విహరించిన స్వామివారు
ధర్మపురిలోకొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
ధర్మపురి, మార్చి 28: జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఆదివారం లక్ష్మీనర్సింహస్వామి (యోగా)వారి తెప్పోత్సవం, డోలోత్సవం వైభవంగా నిర్వహించారు. తెప్పోత్సవం సందర్భంగా బ్రహ్మపుష్కరిణి(కోనేరు)కి రంగులు వేసి, విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. దేవాలయం నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహాలను కోనేరు వరకూ ఊరేగింపుగా తీసకువచ్చి కోనేరులో అందంగా అలంకరించిన హంస వాహనంలో ఉత్సవ మూర్తులను ఉంచి ఐదు ప్రదక్షిణలు చేయించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డోలోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం రాత్రి 9గంటల వరకూ కొనసాగగా భక్తులు క్యూలైన్లో వచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. తెప్పోత్సవ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు హాజరై తిలకించారు.
బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, ఏర్పాట్లపై రెండు నెలల నుంచి ఆలయ సిబ్బందితో పాటు వివిధ శాఖల అధికారులను ముందస్తుగా అప్రమత్తం చేసినట్లు మంత్రి తెలిపారు. భక్తులు పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవాలన్నారు. లక్ష్మీనర్సింహస్వామి కృప ప్రతి భక్తుడిపై ఉంటుందన్నారు. నిర్మల్, నిజామాబాద్, బైంసా, ఊట్నూర్ నుంచి వచ్చిన భక్తుల పాటలు, గోదావరిఖని, ధర్మపురికి చెందిన మహిళల కోలాట నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నది. కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం 3గంటలకు కోనేరులో లక్ష్మీనర్సింహస్వామివారి(ఉగ్ర) తెప్పోత్సవం, డోలోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
10వేల మంది అన్నదానం..
బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రి ఈశ్వర్ సూచనల మేరకు స్థానిక పాత టీటీడీ కల్యాణ మండపంలో రైస్మిలర్లు, ఆర్యవైశ్యుల సహకారంతో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో ఆదివారం దాదాపు 10 వేల మంది భక్తులు హాజరయ్యారు. అన్నదానంలో మంత్రి ఈశ్వర్ పాల్గొని సేవలందించారు. కార్యక్రమాల్లో దేవస్థానం ఈవో శ్రీనివాస్, డీసీఎమ్మెస్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, జడ్పీటీసీలు బాదినేని రాజేందర్, బత్తిని అరుణ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, నాయకులు అక్కనపల్లి సునీల్ కుమార్, ఇనుగంటి వినోద్రావ్, ఇనుగంటి వెంకటేశ్వర్రావ్, సంగి శేఖర్, చిలివేరి శ్యాంసుందర్, మురికి శ్రీనివాస్ తదితరులున్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రభుత్వ బ్యాంకులకే మొండి బాకీల సమస్య!
64 రోజుల్లో ఎయిరిండియాకు నూతన మేనేజ్మెంట్!