కరీంనగర్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ ఓదెల/వీణవంక : టీఆర్ఎస్ యువనాయకుడు పాడి కౌశిక్రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే కోటాలో అవకాశం కల్పించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన కౌశిక్రెడ్డి.. గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగేవారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు అకర్షితుడై.. తన వంతు పాత్ర పోషించేందుకు కొద్ది నెలల క్రితం టీఆర్ఎస్లో చేరారు. ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అత్యంత అంకితభావంతో పనిచేశారు. కౌశిక్రెడ్డి క్రికెట్ క్రీడాకారుడు. రంజీ ప్లేయర్. దులీప్, రంజీ ట్రోఫీలో ఆడారు. క్రికెట్కు వీడ్కోలు పలికి, 2009లో తన నాయనమ్మ పుష్ప మాలాదేవి పేరుతో మెమోరియల్ ట్రస్ట్ నెలకొల్పి సమాజసేవను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాజకీయంలో అడుగు పెట్టారు. కరీంనగర్ జిల్లాలో యువతను క్రీడల వైపు మళ్లించేందుకు పలు క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించారు. పలువురు పేద విద్యార్థులకు పైచదువుల కోసం ఫీజులు చెల్లించడం, ఉచితంగా పుస్తకాలు, విద్యా సామగ్రిని అందించడం వంటివి చేశారు. వీణవంక మండల కేంద్రంలో నాయనమ్మ తాత పేర్లమీద బస్టాండును నిర్మించారు. దేవాలయాల నిర్మాణానికి భూములు, డబ్బులను విరాళంగా అందించారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిండ్లకు సహాయం చేశారు. గతంలో పీపీసీ కార్యదర్శిగా, హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జిగా పనిచేసిన ఆయన, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగమయ్యేందుకు టీఆర్ఎస్లో చేరారు. కౌశిక్రెడ్డి చేరిన రోజే ముఖ్యమంత్రి అతనికి మంచి హోదా కల్పిస్తామని బాహాటంగానే హామీ ఇచ్చారు. ఆ మేరకు.. ఆయన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించడానికి పేరును ప్రతిపాదిస్తూ రాజ్భవన్కు పంపించారు. దీనికి కేబినెట్ అమోదం కూడా తెలిపింది. పలు కారణాలను పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో కౌశిక్రెడ్డికి అవకాశం కల్పించారు. యువనాయకుడి రాకతో హుజూరాబాద్ రాజకీయాల్లో పలు మార్పులు జరుగుతాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కౌశిక్రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో అవకాశం రావడంపై హర్షం వ్యక్తమవుతోంది.
పరిపాలనా రంగానికి ప్రతీక
పరిపాలనా రంగానికి ప్రతీక అయిన మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి అవకాశం కల్పించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డి కలెక్టర్గా పరిపాలనా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టించడంలో ముందుకు సాగారు. ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డి 1996లో గ్రూప్-1, రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కలెక్టర్గా చేరి అంచెలంచెలుగా కలెక్టర్ స్థాయికి ఎదిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. కాళేశ్వరం, మల్లన్నసాగర్ వంటి కీలక ప్రాజెక్ట్ల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణలో కీలక భూమిక పోషించారు. అలాగే.. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ విషయంలో సిద్దిపేట వరకు భూసేకరణ పూర్తిచేయడంలో అసాధారణ పాత్ర వహించారు. సిద్దిపేట కలెక్టర్గా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంతో పాటు అభివృద్ధిలో సిద్దిపేట జిల్లాను రాష్ట్రంలో అగ్రభాగాన నిలిపారు. సీఎం, మంత్రుల సహకారంతో సిద్దపేటను రోల్ మోడల్గా నిలపడంలో వెంకట్రామిరెడ్డి పాత్ర ఉంది. మృదుస్వభావి, ఏ పదవి ఇచ్చినా అంకితభావంతో పనిచేసే మనస్తత్వం ఉన్న నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని.. ముఖ్యమంత్రి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీగా అవకాశం రావడంతో వెంకట్రామిరెడ్డి స్వగ్రామం ఇందుర్తితో పాటు ఓదెల మండలవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సామాజిక సేవలో..
గతంలో తెలంగాణ రాష్ట్రంలో వెంకట్రామిరెడ్డి, అతని సోదరుడు సత్యనారాయణరెడ్డి ఇద్దరూ ఐఏఎస్లుగా పనిచేశారు. పెద్దపల్లి జిల్లా ఇందుర్తి గ్రామానికి చెందిన పరుపాటి పుష్పలీల-రాజిరెడ్డి(వకీల్)ల కొడుకు వెంకట్రామిరెడ్డి. జిల్లాల పునర్విభజనకు ముందు పరుపాటి వెంకట్రామిరెడ్డి మెదక్ జేసీగా ఉండి, జిల్లాల పునర్విభజనలో కొత్త జిల్లాగా ఏర్పడిన సిద్దిపేటకు కలెక్టర్గా నియమితుల య్యారు. పాలనలో పారదర్శకతతోపాటు విధుల నిర్వహణలో అంకితభావంతో పనిచేసే గుణం ఉందని గుర్తించిన సీఎం కేసీఆర్ వెంకట్రామిరెడ్డి, సోదరుడు సత్యనారాయణరెడ్డి అన్నదమ్ములిద్దరికీ కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ కారణంగానే సీఎం తన సొంత జిల్లా సిద్ధిపేట కలెక్టర్గా వెంకట్రామిరెడ్డికి బాధ్యతలను అప్పగించారు. తల్లిదండ్రులు గతంలో ఇందుర్తిలోనే నివాసం ఉండేవారు. తండ్రి సుల్తానాబాద్ కోర్టులో న్యాయవాద వృత్తిలో కొనసాగారు. ఆ కాలంలో విద్యావంతుల కుటుంబం కావడంతో కుమారులందరినీ హన్మకొండ పట్టణంలో ఉన్నత చదువులు చదివించారు. ఆరుగురు సోదరుల్లో విజేందర్రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, పెద్ద కుమారుడు జయచంద్రారెడ్డితో పాటు మహేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మిగతా ఇద్దరిలో ఒకరు సత్యనారాయణరెడ్డి నల్లగొండ జిల్లా కలెక్టర్గా, కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా పని చేశారు. ‘పరుపాటి’ సోదరులు సామాజిక సేవలో సైతం ముందుంటారనే పేరు ఉంది. స్వగ్రామం ఇందుర్తితోపాటు రాష్ట్రంలో ప్రధాన పుణ్యక్షేత్రమైన ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో దాదాపు రూ.70 లక్షల వ్యయంతో యాత్రికుల వసతి గదులతో పాటు అతిథి గృహం కట్టించారు. ఆలయ అభివృద్ధికి ఎంతో సహకరించిన గుర్తింపు వారికి ఉన్నది. పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి భక్తులందరికీ ఉపయోగపడే గదులు నిర్మించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. స్వగ్రామానికి చెందిన పలువురు యువకులకు తమ కంపెనీలో ఉద్యోగావకాశాలు కల్పించారు. తల్లి పుష్పలీల సమన్వయంతో కుటుంబసభ్యులందరూ ఉమ్మడిగానే ఉంటున్నారు.
సీఎం కేసీఆర్కు మా కృతజ్ఞతలు
మా స్వగ్రామం ఇందుర్తికి చెందిన ఐఏఎస్ పరుపాటి వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ కోటలో అవకాశం కల్పిస్తున్నందుకు మొదటగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెల్పుతున్నం. అన్నదమ్ములిద్దరు ఐఏఎస్గా, పరుపాటి కుటుంబ సభ్యులు అందరు కూడా స్వగ్రామం ఇందుర్తితో పాటు మండల అభివృద్ధికి కృషి చేసిన వారే. పేదలపై జాలి గుణం కలిగి ఉండి, అభివృద్ధి పనుల్లో ముందు ఉండే వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం సీఎం కేసీఆర్ గొప్పదనానికి నిదర్శనం. బంగారు తెలంగాణ దిశగా పయనిస్తున్న రాష్ట్రంలో మా ఊరి పాత్ర ఉండనున్నందుకు సంతోషంగా ఉంది. మా ఊరిలో పండుగ వాతావరణం కనిపిస్తుంది.