మాస్క్ మస్ట్ టీకా బెస్ట్
భయపెడుతున్న సెకండ్ వేవ్
విజృంభిస్తున్న వైరస్
పెరుగుతున్న కేసుల సంఖ్య
జిల్లాల వారీగా అప్రమత్తమైన యంత్రాంగం
కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు
మాస్కు లేకుంటే ఫైన్లు, కేసులు
విజయవంతంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్
నేటి నుంచి 45 ఏండ్లు దాటిన వారందరికీ టీకాలు
కరీంనగర్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లాలో సెకండ్ వేవ్ ప్రభావం కనిపిస్తున్నది. ఒక్క మార్చిలోనే 1,061 కేసులు నమోదు కావడం కలకలం రేపుతున్నది. కరీంనగర్లో 226 కేసులు రాగా, ఇద్దరు మరణించారు. సిరిసిల్లలో 359 కేసులు నమోదు కాగా, ఇద్దరు మృత్యువాత పడ్డారు. పెద్దపల్లిలో 147 కేసులు నమోదవగా ఒక్కరు మరణించారు. ఇక జగిత్యాలలో 329 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తమైన ప్రభు త్వం ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు విధించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకు నాలుగు రోజుల క్రితమే ఆదేశాలు వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేరకు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. లేనిపక్షంలో (విపత్తుల నిర్వహణ చట్టం-2005లోని 51-60 సెక్షన్లతోపాటు ఐపీసీ 188) చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశమున్నది. మాస్కులు ధరించని వారికి వెయ్యి జరిమానాతోపాటు ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించే అవకాశమున్నది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో 66 మందికి జరిమానా విధించారు. జగిత్యాల జిల్లాలో 18 మందిపై కేసు నమోదు చేశారు. అలాగే, ఏప్రిల్ 30 వరకు ఎలాంటి వేడుకలు, ఊరేగింపులు, ర్యాలీలు, మత పరమైన ప్రార్థనలు నిర్వహించరాదని, జనం సమూహంగా ఉండరాదని ఆంక్షలు విధించారు. పని ప్రదేశాలు, బహిరంగ స్థలాలు, ప్రజా రవాణా సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి.
నేటి నుంచి విస్తృతంగా టీకాలు..
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేపట్టిన వ్యాక్సినేషన్లో వేగం పెంచారు. ఇప్పటి వరకు 62,596 మందికి మొదటి డోస్, 21,717 మందికి రెండో డోస్ టీకాలు వేశారు. ఇందులో హెల్త్ కేర్ వర్కర్లు మొదలుకుని, ఫ్రంట్ లైన్ వారియర్స్, 45 నుంచి 59 ఏళ్లు ఉండి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు మాత్రమే ఉన్నారు. గురువారం నుంచి వ్యాక్సినేషన్ మరింత విస్తృతం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అందులో భాగంగా 45 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకాలు వేయాలని అధికారులను ఆదేశించాయి. ఇప్పటికే వ్యాక్సినేషన్ కొనసాగుతున్న కరీంనగర్లో 22 ప్రభుత్వ, 6 ప్రైవేట్ దవాఖానలు, ఇక జగిత్యాలలో 11, పెద్దపల్లిలో 30, సిరిసిల్లలో 15 ప్రభుత్వ సెంటర్ల చొప్పున మొత్తం 84 కేంద్రాల్లో కొవిడ్ టీకాలు వేస్తున్నారు. 45 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ ముందుగా కొవిన్ యాప్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, లేదంటే ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఆయా వ్యాక్సినేషన్ కేంద్రాలకు ఆధార్, ఓటరు, పాన్, తదితర వ్యక్తిగత గుర్తింపు కార్డులతో వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. అన్ని ప్రభుత్వ, ఏరియా దవాఖానలు, పీహెచ్సీలు, అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు.