హైదరాబాద్, జూలై 26, (నమస్తే తెలంగాణ): నార్త్ మసిడోనియా వేదికగా ఈనెల 30 నుంచి మొదలయ్యే ప్రపంచ యూత్ హ్యాండ్బాల్ టోర్నీకి రాష్ట్ర యువ ప్లేయర్ మడావి కరీనా ఎంపికైంది. ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్..మంగళవారం కరీనాను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ క్రీడలకు సముచిత ప్రాధాన్యమిచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ప్లేయర్లకు తగిన రీతిలో ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం చిచ్చుపల్లి గ్రామానికి చెందిన కరీనా..రాష్ట్ర గిరిజన రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. కరీనా అభినందన కార్యక్రమంలో గిరిజన సంక్షేమం రీజినల్ కో ఆర్డినేటర్ గంగాధర్, ప్రిన్సిపల్ రమ్య, కోచ్ అరవింద్, రమేశ్ తదతరులు పాల్గొన్నారు.