కరోనా తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ కళ తప్పింది. అగ్ర హీరోల చిత్రాలు కూడా పరాజయం పాలయ్యాయి. మరోవైపు పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 వంటి దక్షిణాది చిత్రాలు హిందీ బెల్ట్లో వసూళ్ల సునామీ సృష్టించాయి. దీంతో ఇక బాలీవుడ్ పరిశ్రమ ఇప్పట్లో కోలుకోవడం కష్టమని, హిందీ సినిమాల ఆధిపత్యానికి దక్షిణాది చిత్రాలు సవాలు విసురుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వీటిపై అగ్ర దర్శకనిర్మాత కరణ్జోహార్ స్పందించారు. బాలీవుడ్ పనైపోయిందనే స్టేట్మెంట్స్ అర్థరహితమని పేర్కొన్నారు. మంచి సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని, కంటెంట్ పరమైన లోపమే బాలీవుడ్కు శాపంగా మారిందన్నారు. ‘బాలీవుడ్ సినిమా తిరిగి పుంజుకుంటుంది.
అందులో ఎలాంటి సందేహం లేదు. గంగూభాయి కతియావాడి , భూల్ భూలయ్య-2 చిత్రాలు భారీ వసూళ్లను సాధించాయి. కరోనా అనంతరం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కావడం లేదు. రాబోవు రోజుల్లో ఆమిర్ఖాన్, అక్షయ్కుమార్, సల్మాన్ఖాన్ వంటి అగ్ర హీరోల చిత్రాలు రాబోతున్నాయి. వాటితో బాలీవుడ్ పూర్వ వైభవం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఇప్పుడు హిందీ చిత్రసీమ మంచి కంటెంట్పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది’ అని కరణ్జోహార్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో రణ్వీర్సింగ్, అలియాభట్ జంటగా నటిస్తున్నారు. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత కరణ్జోహార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే కావడం విశేషం.