లక్నో: బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. తాము స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియోలు తీసినట్లు హాస్టల్ విద్యార్థినులు ఆరోపించారు. ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంపై పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు. యూపీలోని కాన్పూర్లో ఈ సంఘటన జరిగింది. సాయి నివాస్ బాలికల హాస్టల్లో పని చేసే ఒక ఉద్యోగి మొబైల్ ఫోన్లో అసభ్య వీడియోలను గుర్తించారు. బాలికలు స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో రికార్డు చేసినట్లు అనుమానించారు. దీంతో ఆ హాస్టల్ విద్యార్థినులు దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించకపోవడంతో పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు.
మరోవైపు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి ఆ ఉద్యోగిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపినట్లు చెప్పారు.
కాగా, ఇటీవల ఇలాంటి సంఘటన పంజాబ్లోని చండీగఢ్ యూనివర్సిటీని కుదిపేసింది. హాస్టల్కు చెందిన యువతి రహస్యంగా రికార్డు చేసిన తమ ఫొటోలు, వీడియోలను బాయ్ ఫ్రెండ్కు పంపిందని ఆరోపిస్తూ విద్యార్థులు భారీ స్థాయిలో ఆందోళన చేశారు.