నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియలో శుక్రవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించక ముందే ఆ పార్టీ నాయకురాలు కంకణాల నివేదిత ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.
పార్టీ తనకే టికెట్ ఖరారు చేస్తుందన్న నమ్మకంతో నామినేషన్ దాఖలు చేసినట్లు ఆమె తెలిపారు. అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం ఇంకా ఏ నిర్ణయం తీసుకోక ముందే నివేదిత నామినేషన్ దాఖలు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఒకవేళ పార్టీ ఆమెకు టికెట్ కేటాయించని పక్షంలో రెబల్గా బరిలో ఉంటుందా.? లేక ఉపసంహరించుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
నివేదిత నామినేషన్ దాఖలు చేసి ఓ రకంగా ఆ పార్టీని ఇరకాటంలో పడేసింది. బీజేపీ నివేదితనే ఉప ఎన్నిక బరిలో నిలుపుతుందా.! లేక మరో అభ్యర్థిని పోటీలో నిలిపి ఆమెకు మొండి చెయ్యి చూపుతుందా చూడాలి.
ఈ విషయంలో బీజేపీ అధిష్ఠానం ఏ విధంగా స్పందిస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
సాగర్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. నాలుగో రోజు 8 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఇప్పటివరకు మొత్తం 20 మంది అభ్యర్థులు 23 నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్ సింగ్ తెలిపారు.
రంగారెడ్డి జిల్లా చంద్రధన గ్రామానికి చెందిన వడ్ల శ్యామ్ (అన్న వైఎస్సార్ పార్టీ), పెద్దవూర మండలం పోతునూరుకు చెందిన వడ్లపల్లి రామకృష్ణారెడ్డి ( సమాజ్ వాదీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ),
అనుముల మండలం చెల్మారెడ్డి గూడేనికి చెందిన ముదిగొండ్ల వెంకటయ్య (మహాజన సోషలిస్టు పార్టీ), నియోజకవర్గానికి చెందిన మరో నలుగురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ నెల 27, 28, 29 తేదీలు సెలవు దినాలు కావడంతో నామినేషన్లకు అవకాశం ఉండదు. 30వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.
31న నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుండగా.. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం ప్రకటించనున్నారు.