చందూర్, అక్టోబర్ 28 : వ్యవసాయ భూమిని తన పేరుపైన రాసి ఇవ్వలేదనే కోపంతో కొడుకు తల్లిని హతమార్చిన సంఘటన చందూర్ మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ముక్కెర సాయమ్మ (50)పేరుపైన ఐదు ఎకరాల భూమి ఉంది. సాయమ్మకు కుమారుడు నారాయణ, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కొంతకాలంగా నారాయణ భూమిని తన పేరుపైకి మార్చాలని తల్లిని వేధించసాగాడు. ఈ విషయమై పలుమార్లు గొడవ పడ్డాడు. బుధవారం రాత్రి సైతం ఈ విషయమై తల్లి, కొడుకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. దీంతో కోపోద్రిక్తుడైన నారాయణ తల్లిపై దాడికి దిగి గొంతు నులిపి హత్య చేశాడు. విద్యుదాఘాతంతో మృతి చెందిందని ఒకసారి డ్రైనేజీలో పడిపోయిందని మరోసారి నమ్మించే ప్రయత్నం చేశాడు. సాయమ్మ పెద్ద కుమార్తె శోభ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ రామారావు, సీఐ అశోక్రెడ్డి, ఎస్సై అనిల్రెడ్డి తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు.